బీమా రంగానికి చెందిన ప్రస్తుత విధానాలు ఎల్ఐసీ పెట్టుబడుల ఉప సంహరణకు అనుమతించవని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) కార్యదర్శి అనురాగ్ జైన్ పేర్కొన్నారు. ఈ కారణంగా గతంలో ఉన్న మార్గదర్శకాలను సవరించవలసి ఉంటుందని తెలిపారు. ఇవన్ని కలిసి ఎఫ్డీఐ విధానాలను మరింత సరళీకరణ చేస్తున్నట్టు.. సవరించిన విధానాలను వీలైనంత తొందరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ అంశాలపై ఆర్థిక సర్వీసుల విభాగం, దీపమ్ చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. డీపీఐఐటీ, డీఎఫ్ఎస్, దీపమ్ మధ్య చర్చలతో అవసరమైన సవరణలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు అనురాగ్ జైన్. తరువాతి క్యాబినెట్ అనుమతి కోరనున్నట్టు చెప్పారు.
ఈ ప్రత్యక్ష విదేశి పెట్టుబడుల (ఎఫ్డీఐ) విధానాల ద్వారా.. బీమా రంగంలో ఆటోమేటిక్ మార్గం ద్వారా 74% మేర విదేశీ పెట్టుబడులకు అనుమతి ఉంటుంది. అయితే, ప్రత్యేక చట్టంలో భాగమైన ఎల్ఐసీకి ఇవి వర్తించబోవు.. సెబీ నిబంధనల ఆధారంగా ఎఫ్పీఐ, ఎఫ్డీఐలను పబ్లిక్ ఆఫర్ ద్వారా అనుమతి ఇవ్వనున్నారు. ఎల్ఐసీ ప్రత్యేక చట్టంలో విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉండదు. దీంతో పెట్టుబడుల కోసం ప్రస్తుతం ఉన్న విధానాలలో మార్పులు చేపట్టవలసి ఉందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది జులైలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యాబినెట్ ఆమోదించిన విషయం విధితమే. ఇప్పుడు మార్చిలోగా ఐపీవోను పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.