మధురవాడ ఆదిత్య ఫార్చ్యూన్‌ అపార్టుమెంట్‌లో చనిపోయిన ఎన్‌ఆర్‌ఐ కుటుంబం మృతి పట్ల  భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కుటుంభంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గొప్ప గొప్ప చదువులు చదివారు. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. దేనికి లోటు లేదు. కోట్లకు పడగలెత్తిన కుటుంభం వాళ్ళది. అన్ని ఉన్నా ఏమి లాభం చెప్పండి. మొత్తం కుటుంబం అంతా చెల్లాచెదురై పోయింది. అసలు వాళ్ళది హత్యేనా.. లేక ఆత్మహత్యనా అనే విషయం అంతు చిక్కడం లేదు. తల్లిదండ్రులు, తమ్ముడి శరీరంపై గాయాలుండడంతో మానసిక స్థితి సరిగా లేని పెద్ద కుమారుడే వాళ్ళని హత్య చేసి తనూ కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడు అనే అనుమానాలను  పోలీసులు ప్రాథమికంగా వ్యక్తం చేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బహ్రెయిన్‌లో స్థిరపడిన విజయనగరం జిల్లా గంట్యాడ వాసి సుంకరి బంగారునాయుడు నాలుగేళ్ల కిందట కుటుంబంతో సహా నగరానికి వచ్చారు.  మధురవాడ మిథిలాపురి ఉడాకాలనీలోని  ఒక విలాసవంతమైన ఆదిత్య ఫార్చ్యూన్‌ అపార్ట్‌మెంట్‌ సి బ్లాకు, 505 ప్లాట్‌లో భార్య నిర్మల, ఇద్దరు కుమారులు దీపక్, కశ్యప్‌లతో కలిసి 8 నెలలు క్రితం అద్దెకు దిగారు.అంతేకాకుండా  అక్కడికి సమీపంలోనే సుమారు కోటి రూపాయల విలువ చేసే ఒక అద్భుతమైన భవనం కూడా నిర్మించుకుంటుండడంతో భవనానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి  అక్కడ అద్దెకు దిగారని బంధువులు చెబుతున్నారు.



బంగారునాయుడు నివసిస్తున్న ప్లాట్‌లో బుధవారం రాత్రి ఏం జరిగిందన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. సివిల్‌ ఇంజినీర్‌గా పనిచేసిన బంగారునాయుడు బహ్రెయిన్‌లో తెలుగు అసోసియేషన్‌ కార్యదర్శిగా గతంలో పనిచేశారు. 2007లో ఏయూ నుంచి డాక్టరేట్‌ తీసుకున్నారు. రఘు కళాశాలకు కన్సటెంట్‌గా పనిచేస్తున్నారు. అతని భార్య నిర్మల డాక్టర్‌గా పనిచేస్తున్నారు. దీపక్‌ ఢిల్లీ ఎన్‌ఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తి సివిల్స్‌ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడు. చిన్నకుమారుడు కశ్యప్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. కుటుంభంలో అందరూ కూడా గొప్ప  విద్యావంతులై ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న ఇంటిలో ఉన్నటుండి అసలు ఏం జరిగిందన్నది ఎవరికి అంతు చిక్కడం లేదు.వాళ్ళని ఎవరన్నా హత్య చేసారా అంటే అది కూడా క్లారిటీ లేదు ఎందుకంటే చివరగా ఆ ఇంటిలోకి బుధవారం రాత్రి 8.55గంటలకు బంగారునాయుడు మాత్రమే ప్రవేశించినట్లు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా తెలిసింది.


అ తరువాత బయట వ్యక్తులు ఎవరు కూడా ఇంటిలోపలోకి ప్రవేశించలేదు. బంగారు నాయుడు ఇంట్లోకి వెళ్లిన అనంతరం పెద్దగా గొడవ జరిగినట్లు పక్క ప్లాట్ల వారు చెబుతున్నారు.ఈ క్రమంలో గురువారం తెల్లవారి 3 గంటల సమయంలో ఒక్కసారిగా శబ్ధం వచ్చినట్లు సెక్యూటీ సిబ్బంది గ్రహించారు.  అపార్ట్‌మెంట్‌ వాసులు భయాందోళనతో అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ప్లాట్‌ వద్దకు చేరుకుని స్థానికుల సాయంతో తలుపులు బద్దలు గొట్టి చూసేసరికి బంగారునాయుడు తలుపును అనుకుని పడి ఉన్నాడు. మరికొద్ది దూరంలో భార్య నిర్మల మృతదేహం ఉంది. చిన్నకుమారుడు కశ్యప్‌ ఓ బెడ్‌ రూమ్‌లో... పెద్ద కుమారుడు దీపక్‌ బాత్‌రూమ్‌లో అచేతనంగా పడి ఉన్నారు  గురువారం ఉదయం సంఘటన స్థలికి చేరుకున్న నగర పోలీసు కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా మీడియాతో మాట్లాడుతూ బంగారునాయుడు, అతని భార్య నిర్మల, చిన్నకుమారుడు కశ్యప్‌ మృతదేహాలపై గాయాలుండడంతో వారి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోందన్నారు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ముగ్గురినీ దీపక్‌ హతమార్చి ఉంటాడని అనుమానిస్తున్నామన్నారు.అలాగే ప్రమాదవశాత్తు జరిగిందా? లేదంటే వారే ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరైనా హత్య చేశారా? అని విచారణ చేస్తున్నట్లు సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా వెల్లడించారు. మరోవైపు బంగారునాయుడు కుటుంబంలో వివాదాలు, మనస్పర్థలు లేవని,  దీపక్‌ మానసిక స్థితి అంతా సక్రమంగా ఉందని, సివిల్స్‌కు సిద్ధమవుతున్నాడని, బంధువులు చెబుతున్నారు.పక్కా ప్రణాళిక ప్రకారం ఎవరో హత్య చేశారని ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని బంధువులు కోరుతున్నారు.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: