
గట్టి వ్యూహంతోనే దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, తమిళనాడు చిన్నమ్మ శశికళ చెన్నైకి చేరుకున్నారు. బెంగుళూరులోని పరప్పన జైలులో ఉన్నపుడు సాధ్యం కాలేదుకానీ విడుదలైన తర్వాత రిసార్ట్స్ లో దాదాపు వారంరోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు కదా. ఈ వారంలోనే తమిళనాడు రాజకీయాలు, ఏఐఏడిఎంకే ప్రస్తుత పరిస్ధితి, తాను అనుసరించాల్సిన వ్యూహాలు, తొందరలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలపై చాలా డీటైల్డ్ గా చర్చించారట. తనకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్నవారితో చాలా సీరియస్ గానే చర్చలు జరిపి వ్యూహాలు రచించారని సమాచారం.
ఇందులో భాగంగానే బెంగుళూరు నుండి చెన్నైకి మధ్యలో ఉన్న తమిళనాడులోని ఏడు జిల్లాల్లో బారీ ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేయించారట. ప్రతి జిల్లాలోని కొద్దిసేపు ఆగి ముఖ్యులతో పాటు మామూలు జనాలతో ముచ్చటించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిచేశారు. అయితే ఆమె ఏఐఏడిఎంకే కార్యాలయాల్లోకి అడుగపెట్టనీయకుండా అధికారపార్టీ జాగ్రత్తలు తీసుకుంది. ఈ విషయం తెలిసే శశికళ కూడా అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. రోడ్లపైనే మామూలు జనాలను కలుసుకుని అభివాదం చేశారు. ఈ ఏడు జిల్లాల్లో భారీ ర్యాలీని ఎందుకు ఏర్పాటు చేశారంటే తమ వెంట వచ్చే వారెవరు ? జనాల్లో తనపై ఎటువంటి అభిప్రాయం, ఆదరణ ఉందో తేల్చుకోవటానికే.
ఈ విషయం గ్రహించే పార్టీ నేతలెవరు చిన్నమ్మను కలవకుండా ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదేశాలు జారీచేశారు. అయితే ఆయన ఆదేశాలను ఎంతమంది పాటిస్తారనేది అనుమానమే. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో డీఎంకేనే అధికారంలోకి వస్తుందనే అనేక సర్వేలు తేల్చి చెప్పాయి. ఇక శశికళ వర్గం కూడా ఏఐఏడిఎంకేను వీలైనంతగా దెబ్బ కొట్టాలన్నదే టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం. ఎందుకంటే జైలుశిక్ష అనుభవించిన కారణంగా ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో పోటీ చేయటానికి శశికళకు ఎలాగు అర్హత లేదు. ఐదేళ్ళ తర్వాత మాత్రమే ఆమె పోటీ చయగలదు. ఇపుడు ఏఐఏడిఎంకేను దెబ్బకొడితే వచ్చే ఎన్నికలకు పార్టీ పూర్తిగా తన చేతిలోకి వచ్చేస్తుందని చిన్నమ్మ భావిస్తున్నారట. కాబట్టి ఎంత వీలైతే అంతా పార్టీని చీల్చేసి మొత్తం పగ్గాలను తన చేతిలోకి తీసుకోవాలన్నవ్యూహంతో శశికళ పావులు కదుపుతున్నారట. అందుకనే సీనియర్లను, జనబలం ఉన్న నేతలను లాగేయాలని ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. చూద్దాం చిన్నమ్మ ప్లాన్ ఎంతవరకు వర్కవుటవుతుందో.