విజయ్‌ - త్రిష.. ఈ కాంబినేషన్‌ కోలీవుడ్‌లో ఎంతటి విజయాలు అందకుకుందో అందరికీ తెలిసిందే. చూడముచ్చటైన జంటగా వీరికి పేరు. అయితే గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరూ కలసి నటించడం లేదు.


విజయ్‌ వరుసగా సినిమాలు చేస్తున్న అందులో త్రిషకు స్థానం కల్పించే అవకాశం రాలేదు. దీంతో ఇద్దరూ స్క్రీన్‌ షేర్‌ చేసుకొని 14 ఏళ్లు దాటిపోయింది. మీరు కూడా ఇలానే లెక్కలేసుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌ న్యూస్‌. ఇద్దరినీ త్వరలో ఒకే ఫ్రేమ్‌లో చూడొచ్చు.


విజయ్‌ ప్రస్తుతం 'వారసుడు' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ముగింపు దశలో ఉంది. ఈ సినిమా అయిన వెంటనే లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు విజయ్‌. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌, కాస్ట్‌ అండ్‌ క్రూ ఎంపిక జరుగుతోందట. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర విషయం తెలిసింది. అదే ఈ సినిమాలో విజయ్‌ సరసన త్రిష ఓ ముఖ్య పాత్రలో నటిస్తోందని.


 


నవంబర్‌లో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తారని సమాచారం. ఇందులో విజయ్ సరసన ఇద్దరు కథానాయికలకు అవకాశముందట. దీంట్లో ఓ పాత్ర కోసం త్రిషను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ పాత్ర గురించి ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందట. సినిమాలో త్రిష పాత్రకు చాలా వెయిట్‌ ఉంటుందని, సాధారణ హీరోయిన్‌లా కాకుండా బలమైన పాత్ర అని టీమ్‌ నుండి సమాచారం వస్తోంది.


విజయ్‌ - త్రిష చివరిగా 14ఏళ్ల క్రితం 'కురువి' అనే సినిమాలో జంటగా కనిపించారు. అంతకుముందు 'గిల్లి', 'తిరుప్పాచి', 'ఆథి' అనే సినిమాల్లో నటించారు. ఆ రోజుల్లో వీరి కాంబినేషన్‌ జోరు అలా ఉండేది మరి. మరి ఇన్నాళ్ల తర్వాత ఇద్దరినీ ఓ ఫ్రేమ్‌లోకి తీసుకొస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌ ఎలా చూపిస్తాడో చూడాలి. మామూలుగా లోకేశ్‌ సినిమాలు డార్క్‌గా ఉంటాయి. మరి త్రిషకు ఏ పాత్ర ఇస్తున్నారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: