లాక్ డౌన్ లో కరోనా కొంచెం కంట్రోల్ లో ఉన్నట్లు కనిపించగానే సినిమా షూటింగులకు పర్మీషన్ లు కూడా తీసుకున్నారు దర్శకనిర్మాతలు. అయితే లాక్ డౌన్ ఎత్తివేయగానే పరిస్థితులు మారిపోయాయి. వందలు వేల నుంచి కరోనా కేసులు లక్షల్లోకి వెళ్లిపోయాయి. దీంతో ఇప్పుడు సినిమాహాళ్లు తెరుచుకోవడం కష్టమని, తెరుచుకున్నా మినిమం ఆక్యుపెన్సీ కూడా కష్టమని అభిప్రాయపడుతున్నారు సినీజనాలు.
బాలీవుడ్ మేకర్ శేఖర్ కపూర్ చాలా రోజుల క్రితమే థియేటర్ షట్ డౌన్ గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. మరో ఏడాది పాటు థియేటర్లు తెరుచుకోవడం కష్టమని, ఇక నుంచి ఫస్ట్ వీక్ కలెక్షన్లు, మొదటి రోజు వసూళ్ల రికార్డులు అన్నీ మాయమవుతాయని పోస్ట్ పెట్టాడు. హీరోలు ఓటీటీకి ఒకే చెప్పడమో, నిర్మాతలు సొంత స్ట్రీమింగ్ ఛానల్స్ ఏర్పాటు చేసుకోవడమో బెటర్ అని ప్రకటించాడు. అప్పుడు శేఖర్ చెప్పిందే ఇప్పుడు నిజమవుతోంది అంటున్నారు చాలామంది దర్శకనిర్మాతలు .
మార్చి నుంచి థియేటర్లు మూతబడినా జనవరి తర్వాత థియేటర్ల దగ్గర హంగామా తగ్గిపోయింది. ‘అలవైకుంఠపురం, సరిలేరు నీకెవ్వరు’ తర్వాత ఆ రేంజ్ సినిమాలు లేకపోవడంతో హడావిడి తగ్గింది. ఫిబ్రవరిలో నితిన్ ‘భీష్మ’ కొంత ప్రభావం చూపినా బాక్సాఫీస్ ని దడదడలాడించిన సినిమాలు రాలేదు. సో మొదటి రెండు నెలలు మినహాయిస్తే 2020 థియేటర్ బిజినెస్ మొత్తం కరోనాలో కలిసిపోయిందనే చెప్పొచ్చు.
ఇప్పటికీ చాలామంది దర్శక, నిర్మాతలు థియేటర్లపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎప్పటికైనా కరోనా తగ్గకపోతుందా.. థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేసుకుందాం అని కలలుకన్నారు. కానీ రోజురోజుకీ కరోనా విజృంభిస్తుండటంతో వారి ఆశలు అడియాశలయ్యాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి