జగన్ ముఖ్యమంత్రి కావాలని వైసీపీ నాయకులు ఎందరో కలలు కన్నారు.. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని తపనపడ్డారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా తొమ్మిదేళ్లు ఆ క్షణం కోసం ఎదురు చూశారు. 2014లోనే ఆ కల సాకారం అవుతుందని ఆశించారు. కానీ ఆ అవకాశం కొద్దిలో తప్పిపోయింది. మరి 2019లోనైనా ఆ కల నెరవేరుతుందా.. లేదా మళ్లీ కొద్దిలో అవకాశం తప్పిపోతుందా.. అని కంగారు పడ్డారు.


ఆ కంగారులోనే జగన్ సీఎం కావాలని చాలా మంది దేవుళ్లుకు మొక్కుకున్నారు. మరికొందరైతే ఏకంగా తిరుపతికి నడిచివస్తామని మొక్కుకున్నారు. ఇంకా రకరకాలుగా మొక్కారు. మొత్తానికి ఆ మొక్కులు ఫలించాయి. జగన్ సీఎం అయ్యాడు. ఇప్పుడు మొక్కులు చెల్లించుకునే సమయం వచ్చేసింది. ఇలా మొక్కిన వారిలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా ఉన్నాడు.


వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తిరుమల కొండకు పాదయాత్రగా వస్తానని ఆయన మొక్కుకున్నారు. ఇప్పుడా మొక్కు తీర్చుకునే ప్రయత్నం ప్రారంభించారు. అందుకే తిరుమలకు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం కాకర్ల నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం అవుతోంది. ఈ పాదయాత్ర సుమారు 15 రోజులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యేతో పాటుగో 100 మంది కొండపైకి కాలినడకన వెళ్లనున్నారు. వీరంతా స్వామివారికి తలనీలాలు సమర్పిస్తారు.


2019 ఎన్నికల్లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాత భారీ మెజారిటీ పొందిన శాసనసభ్యులు అన్నా రాంబాబు. ప్రజా సమస్యలపైనే కాదు, గతంలో అధికార టీడీపీ అకృత్యాలపైనా విరుచుకుపడ్డ సీనియర్ నేత. చంద్రబాబు అక్రమాలపై విచారణ చేయాలని అన్నా రాంబాబు అసెంబ్లీ బైట బైఠాయించారు కూడా. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కనుక స్వామివారి మొక్కు తీర్చుకునేందుకు ఎమ్మెల్యే సెప్టెంబర్ 4 బుధవారం నాడు పాదయాత్రగా బయలుదేరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: