కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో వేగంగా వ్యాపిస్తోంది. అయితే మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాస్త మెరుగనే చెప్పాలి. అందులోనూ కరోనా విషయంలో మొదటి నుంచి తెలంగాణలోనే కేసులు ఎక్కువగా వచ్చాయి. మర్కజ్ లింక్ ఉన్న వారు మొదట కరీంనగర్ కు వచ్చి అక్కడి నుంచి కరోనా స్ప్రెడ్ కావడానికి కారణమయ్యారు.

 

 

అయితే కరోనా విషయంలో ఏపీలో మొదటి నుంచి కేసులు చాలా తక్కువ. మొదట్లో నెల్లూరులో ఒక్క కేసు వచ్చినా ఆ తర్వాత తెలంగాణతో పోల్చుకుంటే చాలా తక్కువ కరోనా కేసులు వచ్చేవి. తెలంగాణ కంటే కనీసం 100- 150 కేసులు తక్కువగా ఉండేవి. కానీ కొన్నిరోజులుగా ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఏపీ క్రమంగా తెలంగాణను అధిగమించి ఏకంగా వెయ్యి కేసుల మార్కు దాటేసింది. శనివారం వెలువడిన హెల్త్ బులెటిన్‌ లో మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరింది.

 

 

అదే సమయంలో తెలంగాణలో కేసులు మాత్రం రోజురోజుకూ చాలా తక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో వెయ్యి లోపే కేసులున్నాయి. శనివారం తొలిసారిగా ఏపీ తెలంగాణను కేసుల విషయంలో అధిగమించింది. అయితే ఇలా ఎలా జరిగింది.. కొన్నిరోజులుగా ఏపీలో కేసుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది. తెలంగాణలో కేసుల సంఖ్య ఎందుకు తగ్గుతోంది..?

 

 

ఈ విషయం పరిశీలిస్తే.. ఏపీ సర్కారు కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు తెప్పించుకుంది. అంతకుముందు ట్రూనాట్ మిషన్ల ద్వారా టెస్టులు చేయించింది. దేశంలోనే అత్యధికంగా టెస్టులు చేయిస్తోంది. దీంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఏకంగా 60 వేలకు పైగా టెస్టులు చేశారు. అందువల్లే కేసుల సంఖ్య పెరుగుతుందంటున్నారు ఏపీ అధికారులు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో టెస్టుల సంఖ్య తక్కువ అందుకే పాజిటివ్ కేసులు కూడా తక్కువగా వస్తున్నాయట. అదీ సంగతి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: