ఆ అయిదేళ్ళు వారి పాలన తీరులో తప్పులు ఉంటే కచ్చితంగా విపక్షంగా బాబు నోరు చేసుకోవాల్సిందే. కానీ ప్రతీ రోజూ పనిగట్టుకుని విమర్శిస్తూంటే తమ్ముళ్లకే అది ఎక్కడంలేదుగా. తెల్లరిలేస్తే జగన్ జగన్ అంటూ బాబు కలవరింతలు చూసిన తమ్ముళ్ళు తలలు పట్టుకున్నారు. 23 సీట్లకు దిగజారిపోయిన పార్టీని గాడిన పెట్టుకునే సువర్ణ అవకాశాన్ని జనం ఇచ్చారు. ఒక విధంగా బాబు ఆలోచించుకోవడానికి, తిరిగి పుంజుకోవడానికి ఇది మంచి తరుణం. కానీ బాబు మాత్రం ఆ వూసు మరచినట్లున్నారు.
ఆయన ఎక్కడో ఉండిపోయారు. ఇంకా జనం తనను ఎందుకు ఓడించారు. సీఎం సీటు తమకే శాశ్వతం కదా అని భ్రమల్లో ఉన్నారని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. తాను ఖాళీ చేసిన సీట్లో జగన్ కూర్చోవడం కూడా బాబు అసలు తట్టుకోలేకపోతున్నారు. జగన్ బీసీలను లాగేస్తున్నారు. వారి కోసం ప్రత్యేక కార్పోరేషన్లను ఏర్పాటు చేశారు. దాంతో ఆయన పాతుకుపోతున్నాడు అన్న కంగారు కూడా పట్టుకున్నట్లుగా ఉంది.
దాంతో ఆయన ప్రతీ రోజూ జగన్ని హెచ్చరిస్తున్నారు. నీ పదవీ కాలం ఈ ఒక్కసారే సుమా. చివరి చాన్స్ నీకు ఇచ్చారు జనం. ఆనక నా జమానాయే సుమా అంటూ వార్నింగుల మీద వార్నింగులు ఇస్తున్నారు. మరి ఈ రకమైన పాలిటిక్స్ చేస్తే ఏపీలో టీడీపీ ఎత్తిగిల్లుతుందా. బాబే ఆలోచించుకోవాలి. నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తేనే జనం మద్దతు లభిస్తుంది. లేకపోతే అసహనం, అక్కసు మాత్రమే బయటపడుతుంది.