రేవంత్ రెడ్డి.... ఈ పేరు గురించి రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారిని ఎవరిని అడిగినా వెంటనే తడుముకోకుండా చెప్పే సమాధానం... 'తెలంగాణ రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ పొలిటికల్ లీడర్' అని... ఆయన టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై, ఆ పార్టీ అగ్ర నాయకులు కేసీఆర్, కేటీఆర్‌పై ఎప్పుడూ తీవ్రస్థాయిలో మండిపడుతుంటారు. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తరచూ రేవంత్ అధికార పక్ష నేతలపై విమర్శలు చేసినా కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ స్పందించే సందర్భాలు చాలా తక్కువ. అయితే తాజాగా మంత్రి కేటీఆర్ రేవంత్‌ రెడ్డి లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్‌‌లో ఉన్నారని, రేపోమాపో బీజేపీలోకి పోతారని కేటీఆర్ జోస్యం చెప్పారు. తన దృష్టిలో రేవంత్‌రెడ్డి అసలు లీడరే కాదని కొట్టిపారేశారు. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డిని ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌ నేతలు త్వరలోనే పార్టీలు మారతారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని కేటీఆర్ పునరుద్ఘాటించారు. అందుకే ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు టీఆర్ఎస్‌కు పట్టం కడుతున్నారని తెలిపారు. దుబ్బాకలో గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ డిపాజిట్లు కోల్పోయినా ఆశ్చర్యం లేదని జోస్యం చెప్పారు. సిద్దిపేటలో బీజేపీ నేతల వ్యాఖ్యలు చాలా అభ్యంతకరంగా ఉన్నాయని వెల్లడించారు. మా ఓపిక నశిస్తే ప్రధాని సహా ఎవరినీ వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. బీజేపీ నేతలను కిషన్‌ రెడ్డి అదుపులో పెట్టుకోవాలని సూచించారు. తెలంగాణ రూ.27,718 కోట్లను వ్యవసాయ రుణమాఫీ చేసినట్టు ఆర్బీఐ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ ఘనత కేసీఆర్ కి, మా ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు. రైతుబంధు రూపంలో రూ.28 వేల కోట్లు ఇచ్చామని.. రాష్ట్ర జీఎస్‌డీపీలో వ్యవసాయ రంగం కంట్రిబ్యూషన్ రెట్టింపు అయ్యిందని తెలిపారు. తెలంగాణలో తలసరి ఆదాయం అరేళ్లలో రెట్టింపు అయ్యిందని.. దివాళాకోరు ప్రతిపక్షాలు ఆర్బీఐ నివేదికను గుర్తిస్తాయో లేదో చూడాలని అన్నారు. ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు కేసీఆర్‌కు జై కొడుతున్నారని గుర్తుచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: