వాహనానికి సంబంధించి ఏ పత్రం లేకపోయినా చలాన్ తోపాటు, కేసులు నమోదు చేసేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖకు ఆదేశాలిచ్చింది. కోవిడ్ కారణంగా రవాణా వాహనాల పర్మిట్లు, రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల గడువు ఫిబ్రవరితో తీరిపోయినా.. ఈ ఏడాది డిసెంబర్ వరకు చెల్లుబాటయ్యేలా లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాల ప్రకారం రవాణాశాఖ సాఫ్ట్ వేర్లో మార్పులు చేసి ఇప్పటి వరకూ ప్రజలకు వెసులుబాటు ఇచ్చారు. కేంద్రం ఇచ్చిన గడువు నెలాఖరుతో ముగుస్తుండటంతో.. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కఠినంగా రోడ్ సేఫ్టీ నిబంధనలు అమలు చేసేందుకు రవాణాశాఖ కింది స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో చెక్పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం అవుతాయని అంటున్నారు అధికారులు.ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘనలకు సంబంధించి కొత్త నియమాల ప్రకారం చలాన్లు భారీగా పెరగబోతున్నాయి. జరిమానాలను భారీగా పెంచుతూ మోటారు వాహన చట్టంలో సెక్షన్ 177 నుంచి 199 వరకు ఉన్న నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త ఏడాదిలో రోడ్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ఉల్లంఘనుల భరతం పట్టబోతున్నారు. రవాణా వాహనానికి పర్మిట్ లేకపోయినా, పన్నులు చెల్లించకుండా వాహనం నడిపినా 200 శాతం జరిమానా విధిస్తారు. అంతర్ రాష్ట్ర పర్మిట్లపైనా రవాణాశాఖ దృష్టి పెట్టబోతోంది. వచ్చే ఏడాది నుంచి రవాణా వాహనాలకు సంబంధించి పూర్తిస్థాయి తనిఖీలు చేపడతామని సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీకి ఇటీవలే రవాణాశాఖ నివేదిక ఇచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి