ఇటీవల నీటి కేటాయింపుల్లో ఏపీపై తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి.. అప్పటి వైఎస్ఆర్ పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ నీళ్లను దొంగతనంగా సీమాంధ్రకు తరలించారని, వైఎస్ కొడుకు జగన్ కూడా అలాగే నీటిని తరలించుకు వెళ్తున్నారంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ నేరుగా ఇలాంటి వ్యవహారాలపై స్పందిస్తారని అనుకోలేం కానీ, మిగతా నాయకులు కూడా నోరు మెదపకపోవడం విచిత్రం. ఒక్క రోజా మాత్రమే టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.

ఇటు తెలంగాణ విషయానికొస్తే.. షర్మిల టీమ్ తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయింది. షర్మిల పార్టీ అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి తెలంగాణ మంత్రులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మంత్రులు సిగ్గుపడాలని, 2004లో వైఎస్ఆర్ తో పొత్తు పెట్టుకున్న విషయం ఇప్పటి టీఆర్ఎస్ నేతలకు గుర్తులేదా అని ప్రశ్నించారాయన. వైఎస్ఆర్ ని దొంగ అంటున్న టీఆర్ఎస్ నేతలే గజదొంగలని విమర్శించారు. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరించారు. షర్మిల పార్టీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేకే, వైఎస్ఆర్ పై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు.

రేపోమాపో షర్మిల కూడా ఇదే విషయంపై రియాక్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఆ పార్టీ నేతలు. వైఎస్ఆర్ ని కానీ, ఆయన పాలనని కానీ వేలెత్తి చూపించే అర్హత టీఆర్ఎస్ నేతలకు లేదంటున్నారు. టీఆర్ఎస్, కేసీఆర్ తో ఉన్న సత్సంబంధాల మేరకు జగన్ టీమ్ సైలెంట్ గా ఉన్నా, షర్మిల మాత్రం ఈ విషయంలో తగ్గేది లేదంటున్నారు. ఎక్కడికక్కడ టీఆర్ఎస్ నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీకంటే ఎక్కువగా టీఆర్ఎస్ పై వైఎస్ షర్మిల, ఆ పార్టీ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ పై చేసిన ఆరోపణలతో ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఇటు జగన్ టీమ్ కాస్త ముందు వెనక ఆలోచిస్తున్నా.. తెలంగాణ రాజకీయాల దృష్ట్యా షర్మిల పార్టీకి ఇది అనుకోని అవకాశంలా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: