చంద్రబాబు అంటే బీజేపీ నేతలు ఎడమే అంటున్నారు. ఆయన నీడ కూడా తమ మీద పడవద్దు అని కూడా వారు గట్టిగా చెబుతున్నారు. చంద్రబాబుకు ఉన్నది రాజకీయ చాణక్యం అయితే లేనిది క్రెడిబిలిటీ. ఆయన విశ్వసనీయత కలిగిన రాజకీయ నాయకుడు కాదు అని కమలనాధులు ఏనాడో గట్టిగా తీర్మానించుకున్నారు. అసలు వర్తమాన రాజకీయాల్లో విలువలు ఉన్నాయా అని ఎవరైనా అడగవచ్చు. ఎంత విలువలు లేకపోయినా ఎక్కడో ఒక చోట విశ్వసనీయత ఉండాలిగా. కనీసం తనను నమ్ముకున్న వారి విషయంలో అయినా అది చూపాలిగా. ఎంతసేపూ రాజకీయ లెక్కలు బేరీజు వేసుకుంటూ అటూ ఇటూ జంపింగులు చేయడంతోనే చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం సాగిపోయింది.

దేశంలో బాబుని మించిన బడా నాయకులు ఉన్నారు. వారిలో మరాఠా యోధుడు  శరద్ పవార్ ఒకరు. ఆయన బాబు కంటే  చిన్న వయసులో అంటే 38 ఏళ్లకే మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రానికి సీఎం అయ్యారు. అలా ఒకసారి కాదు అనేకసార్లు ఆయన ఆ పదవిని చేపట్టారు. ఆయన కేంద్రంలో కూడా కీలకమైన మంత్రిత్వ శాఖలను చాలానే  నిర్వహించారు. ఆయన ప్రధానమంత్రి పదవిని తప్ప అన్నీ చేసేశారు. అయినా సరే శరద్ పవార్ అంటే విశ్వసనీయతకు మారుపేరుగా చెబుతారు. ఆయన కూడా చాలా పార్టీలతో కలిశారు. విడిపోయారు. కానీ నమ్మించి  ఎవరికీ మోసం చేయలేదు. పొత్తు ధర్మాన్ని ఎపుడూ వీడలేదు.

చంద్రబాబు తీరు చూస్తే అలా కాదు, ఎదుటి పార్టీతో పొత్తులు ఉంటే తానే లాభపడాలి. ఆ పార్టీ సోదిలోకి లేకుండా చిత్తు అయిపోవాలి. లాభమంతా తనకు, నష్టమంతా ఆ పార్టీకి అన్నట్లుగా బాబు రాజకీయం సాగుతుంది. మరి అలాంటి బాబు బీజేపీతో ఇప్పటికి అనేకసార్లు పొత్తు పెట్టుకుని తానే లాభపడ్డారు తప్ప బీజేపీ మాత్రం కాదు. ఈ సంగతులు అన్నీ తెలిసిన మీదటనే ఢిల్లీలోని కమలనాధులు బాబును దూరం పెడుతున్నారు. ఏపీలో నోటా కంటే ఓట్లు తక్కువ వచ్చినా ఫరవాలేదు కానీ బాబు జోలికి మాత్రం పోకూడదని గట్టిగానే నిర్ణయించుకున్నారుట. మొత్తానికి ఒకనాడు  బాబుకు బీజేపీ కరివేపాకు అయితే ఇపుడు బీజేపీకి అదే బాబు కరివేపాకుగా మారారని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: