ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మతంగా ఇస్లాం టాప్ స్థానంలో నిలిచింది. అంటే ప్ర‌పంచ జ‌నాభాలో ముస్లింల సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతోంది. 2010-2020 మ‌ధ్య‌న క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు, బౌద్ధులు, యూదులు, ఇతర మతాలకు చెందిన వ్యక్తులు మరియు మతపరంగా సంబంధం లేనివారి జనాభా తీరును పరిశీలించి ప్యూ రిసెర్చ్‌ సెంటర్ తాజాగా ఓ నివేదికను వెల్ల‌డించింది. ఈ నివేదిక ప్ర‌కారం.. ముస్లింల సంఖ్య పెరుగుదల అన్ని ఇతర మతాల కంటే ఎక్కువగా ఉందని స్ప‌ష్ట‌మైంది. 2010 మరియు 2020 మధ్య అంటే ప‌దేళ్ల‌లో ముస్లిం జనాభా 347 మిలియన్లు పెరిగిందని ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం జనాభా వాటాలు 1.8 శాతం పాయింట్లు పెరుగుద‌ల‌తో 25.6 శాతానికి చేరుకుంది.


అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద మత సమూహం అయిన క్రైస్తవ మతం.. రెండవ వేగంగా అభివృద్ధి చెందుతున్న మతంగా నిలిచింది. కానీ, ప్రపంచ జనాభాలో మాత్రం క్రైస్తవుల వాటా 2010-2020 మ‌ధ్య‌న 1.8 శాతం పాయింట్లు తగ్గి 28.8 శాతం వ‌ద్ద నిలిచింది. యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లలో క్రైస్తవ మతంలో క్షీణత నమోదైంది.


ఆ తరువాత మూడో స్థానంలో నోన్స్ లేదా మతపరమైన అనుబంధం లేని వ్యక్తులు ఉన్నారు. ప‌దేళ్ల కాలంలో నోన్స్ సంఖ్య 270 మిలియన్లు పెరిగి 1.9 బిలియన్లకు చేరుకుంది. ప్రపంచ జనాభాలో నోన్స్ వాటా దాదాపు పూర్తి శాతం పాయింట్ పెరిగి 24.2 శాతానికి చేరుకుంది.


ప్ర‌పంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న జాబితాలో హిందులు నాల్గవ స్థానంలో ఉన్నారు. హిందువులు ప్రపంచ జనాభా పెరుగుదల రేటుతో సమానంగా పెరిగారు. హిందువుల సంఖ్య 126 మిలియన్లు పెరిగి 1.2 బిలియన్లకు చేరుకుంది. ప్రపంచ జనాభాలో హిందువుల వాటా 14.9 శాతం వద్ద స్థిరంగా ఉంది.


ఆ 10 సంవత్సరాల్లో యూదు జనాభా దాదాపు ఆరు శాతం పెరిగింది. ఇక 2020లో దశాబ్దం క్రితం కంటే తక్కువ సంఖ్యలో ఉన్న ఏకైక ప్రధాన మత సమూహం బౌద్ధులు. ప్రపంచంలో బౌద్ధుల సంఖ్య 0.8 శాతం తగ్గింద‌ని నివేదిక చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: