కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబాలకు అండగా నిలిచేందుకు సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఘటన జరిగిన నెల రోజుల తర్వాత, ఆ బాధిత కుటుంబాలను ఆయన చెన్నైకు పిలిపించుకుని ఓ రిసార్టులో వ్యక్తిగతంగా కలిశారు. ప్రతి కుటుంబం వద్దకు వెళ్లి మాట్లాడి, వారి కష్టాలను విన్నారు. వ్యక్తిగత ఓదార్పు: విజయ్ ప్రతి కుటుంబం వద్దకు వ్యక్తిగతంగా వెళ్లి ఓదార్చారు. వారి సమస్యలను రాతపూర్వకంగా తీసుకున్నారు. హామీ: ఇల్లు, చదువులు, అనారోగ్యం వంటి ఏ విషయమైనా ఇక తనదే బాధ్యత అని వారికి హామీ ఇచ్చారు. కన్నీటి పర్యంతం: తమతో మాట్లాడుతున్నప్పుడు విజయ్ కన్నీరు పెట్టుకున్నారని బాధిత కుటుంబాలు తర్వాత మీడియాకు వెల్లడించాయి.
 

వెనుకడుగు వేసిన తర్వాత.. తప్పని పరామర్శ .. తొక్కిసలాట జరిగినప్పుడు విజయ్ పారిపోయారని ప్రచారం జరగడంతో ఆయన కొంత ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత కరూర్ కు మళ్లీ వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోననే భయంతో ఆయన కొంతకాలం వెనుకడుగు వేశారు. అయితే, బాధితుల్ని పరామర్శించకపోతే ఆ మచ్చ అలాగే ఉండిపోతుందని గ్రహించారు. భవిష్యత్తులో ప్రజల్లోకి వెళ్లే ముందు ఈ పరామర్శ తప్పనిసరైంది. అందుకే చెన్నైకు పిలిపించుకుని, విజయ్ తన పని పూర్తి చేసి బాధిత కుటుంబాల అభిమానాన్ని తిరిగి పొందగలిగారు. ప్రచార వ్యూహంలో మార్పు: భద్రతా ఆందోళనలు .. కరూర్ ఘటన కారణంగా విజయ్ ప్రచార ప్రణాళికలన్నీ తాత్కాలికంగా ఆగిపోయాయి. దీంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలపైనా ప్రశ్నలు వేయడం మానేశారు. కార్యకలాపాలు నిలిచిపోవడంతో పార్టీలోపల కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది.

 

విజయ్ గతంలో "వర్చువల్ వారియర్స్" అని పిలిచిన సోషల్ మీడియా మద్దతుదారులు సైతం పార్టీ పనితీరుపై, రెండో స్థాయి నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఇటీవల ఆయన తిరుచి, పెరంబలూరు, నాగపట్టణం, తిరువారూరు జిల్లాల్లో పర్యటించి రోడ్ షోలు నిర్వహించారు. కానీ, కరూరు ఘటన తర్వాత పెరిగిన భద్రతా ఆందోళనల నేపథ్యంలో, పార్టీ తన ప్రచార వ్యూహాన్ని సమీక్షించుకోనుంది. కొత్త విధానం: భారీ ర్యాలీలకు బదులుగా డిజిటల్ ప్రచారం, చిన్న స్థాయి సమావేశాలు లేదా ప్రత్యామ్నాయ ఔట్‌రీచ్ ఫార్మాట్‌లను టీవీకే (తమిళగ వెట్రి కజగం) పరిగణలోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. సీబీఐ విచారణ - టీవీకే నేతలే నిందితులు .. మరోవైపు, తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ ప్రారంభించింది. ప్రాథమికంగా కేసు నమోదు చేసింది. ఈ కేసులో టీవీకే నాయకులే నిందితులుగా ఉన్నారు అన్న కోణంలో విచారణ జరగనుంది. విజయ్ స్వయంగా సీబీఐ విచారణను కోరుకోవడంతో, ఆ విచారణలో ఎలాంటి విషయాలు తేలినా ఆయన వ్యతిరేకించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విచారణ ఫలితం విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: