నెల రోజుల్లో కొత్త ఏడాదిలోకి ఏపీ అడుగుపెట్టనుంది. కొత్త ఏడాదిలో రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచే కీలక అంశం- స్థానిక సంస్థల ఎన్నికలు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీకాలం 2026 మార్చి వరకు ఉన్నందున, ముందుగా జరపకుండా ఆగినట్లు పార్టీలో కీలక నేతల ఆలోచనలు సూచిస్తున్నాయి. అయితే, మార్చిలో బడ్జెట్ అనంతరం ఈ స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ పరిణామానికి కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని సమాచారం.


మంచి తరుణం - కూటమికి అస్త్రం .. లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూటమి ప్రభుత్వం తన ఏర్పాట్లలో ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలు అంటే సుమారు రెండేళ్లకు కూటమి అధికారం పూర్తిచేసుకోనుంది. ఈ నేపథ్యంలో, 2024 ఎన్నికల్లో ప్రజలు తమపై ఉంచిన మద్దతు, అభిమానం చెక్కుచెదరలేదని చాటి చెప్పడానికి ఈ స్థానిక ఎన్నికల కంటే మించిన సాధనం మరొకటి లేదు. పైగా, మూడు పార్టీలు కలసి ఉండటం, చేతిలో అధికారం ఉండటం కూటమికి అతిపెద్ద బలం. ఈ సానుకూల వాతావరణాన్ని వంద శాతం ఉపయోగించుకోవడమే కూటమి కర్తవ్యంగా భావిస్తోంది.



కసరత్తు ముమ్మరం - 'సెంట్ పర్సెంట్' స్ట్రైక్ రేట్ లక్ష్యం .. ఏపీలోని మొత్తం ఇరవై ఆరు జిల్లాలలో రాజకీయ పరిస్థితులను, స్థానిక లెక్కలను కూటమి పార్టీలు ఇప్పటి నుంచే బేరీజు వేసుకుంటున్నాయి. ప్రజలకు తాము చేసిన మంచి పనులను బలంగా ప్రచారం చేస్తూనే, సంస్థాగతంగా ఉన్న చిన్న లోపాలను సవరించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. అధికారుల బదిలీలు, కీలక స్థానాలలో ముఖ్య సిబ్బంది నియామకం వంటి పనులు వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన 94 శాతం స్ట్రైక్ రేట్‌ను ఈసారి 'సెంట్ పర్సెంట్' స్ట్రైక్ రేట్‌గా మార్చాలన్నది కూటమి పెద్దల పట్టుదల. వైసీపీ శిబిరంలో వ్యూహాలు .. ఏకైక విపక్షంగా ఉన్న వైసీపీ లోకల్ ఎన్నికల కోసం ఏ మేరకు సన్నద్ధంగా ఉందో చూడాలి. పార్టీ అధినాయకత్వం ఇప్పటికే బూత్ లెవెల్ వరకు కమిటీలు వేయాలని ఆదేశించింది.

 

నియోజకవర్గం స్థాయి వరకు నియామకాలు పూర్తికాగా, మండల, వార్డు, బూత్ లెవెల్ కార్యవర్గాలను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని హైకమాండ్ డెడ్ లైన్ పెట్టింది. ఇదంతా స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే జరుగుతోంది. దిగువ స్థాయిలో వైసీపీ శ్రేణుల్లో ఒక ప్రశ్న వినిపిస్తోంది: చేతిలో అధికారం ఉన్న మూడు పార్టీలు కలిసి లోకల్ ఫైట్‌కు దిగితే, దాన్ని తట్టుకోగలమా? స్థానిక ఎన్నికల్లో అధికంగా ఉండే డబ్బు ఖర్చు, అధికారంలో ఉన్న పార్టీల వైపు సహజంగా ఉండే మొగ్గు... ఈ అంశాలన్నీ వైసీపీని ఆలోచింపజేస్తున్నాయి. హైకమాండ్ నుండి ఎలాంటి దిశా నిర్దేశం వస్తుందోనని నేతలు ఎదురుచూస్తున్నారు. మొత్తం మీద చూస్తే, స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో 2026 మొదట్లో ఒక మినీ సమరానికి తెర లేవనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: