రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా పండుగ ఎంతో ముఖ్యమైన పండుగ. అశ్వయుజ శుద్ధ ఫాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు అని పదవ రోజు విజయదశమిని కలిపి దసరా అని అంటారు. మన దేశంలో ఈ పండుగ వేరు వేరు ప్రాంతాల్లో విభిన్న రీతుల్లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుర్గమ్మను ప్రతిరోజు ఒక్కో అలంకారంతో పూజిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో దుర్గమ్మను బతుకమ్మగా ఆరాధిస్తారు. 
 
విజయదశమి పండుగ రోజున ఏదైనా శుభకార్యానికి శ్రీకారం చుడితే ఆ పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. విజయదశమి పండుగ రోజున "శ్రీ మాత్రే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించి కర్పూర హారతి తీసుకుంటే అంతా శుభమే జరుగుతుందని నమ్మకం. విజయదశమి రోజున కోటి కుంకుమార్చన, లలితసహస్రనామము, అష్టోత్తర పూజలు చేస్తే మంచిదని ఈ పూజలు చేయించటం వలన సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. 
 
విజయదశమి రోజు ఇంటికి వచ్చిన ముత్తైదువులకు దేవిభక్తిమాల, రాజరాజేశ్వరి దేవి పుస్తకాలను తాంబూలంతో పాటు ఇస్తే దీర్ఘ సుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుంది. విజయదశమి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకొని దుర్గా దేవి లేదా రాజరాజేశ్వరీ దేవి ప్రతిమ లేదా పటాన్ని పూజించాలి. దుర్గా దేవీ ఆలయాన్ని సందర్శించటం వలన కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: