తయారీకి కావలసిన పదార్థాలు..
కడక్ నాథ్ కంట్రీ చికెన్-హాఫ్ కేజీ, బియ్యం-కేజీ, ఉప్పు-రుచికి సరిపడా, పసుపు- హాఫ్ స్పూన్, అల్లంవెల్లుల్లి పేస్ట్- రెండు స్పూన్లు, నూనె- తగినంత, పచ్చిమిర్చి- నాలుగు, బిర్యానీ మసాలాలు, దాల్చిన చెక్క-4, బిర్యానీ ఆకులు, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా తీసుకోవాలి.
తయారీ విధానం..
ముందుగా చికెన్ను బాగా శుభ్రం చేసుకోవాలి. కుక్కర్ తీసుకొని అందులో చికెన్, కరివేపాకులు, పసుపు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, నీళ్లు పోసి.. మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో బియ్యాన్ని నానబెట్టుకోవాలి.
ఒక మట్టి కుండను తీసుకొని పొయ్యిపై పెట్టుకోవాలి. అందులో నూనె, బిర్యానీ మసాలా, మసాలా దినుసులు, పచ్చి మిర్చి, బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి.. బాగా వేయించాలి. కొంచె సేపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో నీళ్లు, ఉప్పు వేసి కొంచెం సేపు పాటు నీళ్లు మరిగించాలి.
నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత ముందుగా నానబెట్టిన బియ్యాన్ని అందులో వేసుకోవాలి. ఒక పది నిమిషాలు రైస్ ఉడకనివ్వాలి. బియ్యం సగం ఉడికిన తర్వాత అందులో ముందుగా ఉడికించిన కడక్నాథ్ చికెన్ను అందులో వేసి మూత పెట్టుకోవాలి. నీళ్లు ఆవిరయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాగా ఉడికిన తర్వాత అందులో పుదీనా, కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుని దింపుకోవాలి. అంతే.. కడక్నాథ్ కంట్రీ చికెన్ బిర్యానీ రెడీ.