వినూత్న ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంపై దేశంలోనే తొలిసారి మహిళా డిగ్రీ వ్యవసాయ గురుకుల కళాశాల నెలకొల్పినట్లు తెలంగాణ మంత్రి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు. నాణ్యమైన ఆహారం ప్రపంచానికి అందించడం మనందరి బాధ్యత... అన్నం పెట్టే వ్యవసాయ రంగం ఎంతో గొప్పదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ‘వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచడంలో రసాయనాల పాత్ర, సుస్థిర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు’ అనే అంశంపై మంత్రి ప్రసంగించారు.


ప్రపంచ ఆకలితీర్చే సత్తా భారత్‌కు ఉందన్న మంత్రి నిరంజన్‌ రెడ్డి .. వ్యవసాయంలో పురుగుమందుల వాడకంపై నియంత్రణ ఉండాల్సిందేనని, హానికరమైన కీటకాలను నియంత్రించేటప్పుడు పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చూడాలని సూచించారు. ఈ విషయంలో పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలతోపాటు ప్రైవేటు పరిశ్రమలు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి  కోరారు. పురుగు మందుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించి చైతన్యపర్చాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు.


రసాయనాల వాడకంతో పంట ఉత్పత్తులు గణనీయంగా పెరిగిన తరుణంలో ప్రతి ఒక్కరూ శాస్త్రజ్ఞుల పరిజ్ఞానం, శాస్త్రం అర్థం చేసుకోవాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి  స్పష్టం చేశారు. పురుగు మందుల వాడకంలో రైతులు మోసపోకుండా చట్టపర నియంత్రణకు పరిశ్రమలు సూచనలు ఇవ్వాలని.. రసాయనాల వాడకం, యాంత్రీకరణలో ఊబరైజేషన్ దిశగా ప్రాధాన్యం ఇచ్చి శాస్త్రవేత్తలు దృష్టి పెట్టాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి గుర్తుచేశారు.


కేంద్రం... వ్యవసాయ రంగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని... సాగు నీరు, విద్యుత్, నేల ఆరోగ్యం, పంటల వైవిధ్యీకరణ, పంటల నాణ్యత, పంటల మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి  సూచించారు. తెలంగాణలో వీటిపై దృష్టి సారించి లక్ష్యానికి చేరువైందని.. పరిశ్రమలు వ్యాపార దృక్పధంతోపాటు సామాజిక బాధ్యతను నెరవేర్చాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి  సూచించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో వే సైడ్ మార్కెట్ నిర్మించిన సింజెంట కృషి అభినందనీయమని మంత్రి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: