సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. పరశురామ్ తీస్తున్న ఈ సినిమా మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ జానర్ లో తెరకెక్కుతున్నట్లు టాక్. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా మది ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఈ సినిమాపై ఎంతో భారీ అంచనాలు ఉన్నాయి.
చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాని తదుపరి షెడ్యూల్ వాస్తవానికి ఈ పాటికి ప్రారంభం కావలసి ఉంది, అయితే ఇటీవల మహేష్ బాబుకి కరోనా పాజిటివ్ రావడం, అనంతరం కొద్దిరోజులకే ఆయన సోదరుడు రమేష్ బాబు అకాల మరణం చెందడంతో ఇటువంటి పరిస్థితుల్లో ఆయనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సర్కారు వారి పాట టీమ్ కొన్నాళ్ల పటు షూట్ వాయిదా వేసినట్లు సమాచారం. ఇక తనకు తండ్రి సమానుడైన అన్నయ్య రమేష్ మృతితో మహేష్ బాబు ఎంతో కృంగిపోయారు. అన్నయ్య మరణం పై ఆయన పెట్టిన ఎమోషనల్ పోస్ట్ అందరినీ ఎంతో కదిలించింది.
అయితే విషయం ఏమిటంటే నేడు రమేష్ బాబు పెద్ద కర్మ కావడంతో ఆయన ఇంటికి విచ్చేసారు మహేష్ బాబు. ఆ సందర్భంగా అక్కడికి వచ్చిన మీడియా వారు ఆయన ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆ ఫొటోల్లో మహేష్ ని చూస్తుంటే ఆయన ముఖంలో బాధ ఎంతో కనపడుతోందని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా అన్నయ్య మరణ ఘటనని ఆయన పూర్తిగా మర్చిపోయి మాములు మనిషి కావడానికి మరికొంత సమయం పడుతుందని, అప్పటి వరకు మహేష్ ఎటువంటి ఇతర కార్యక్రమాలు పెట్టుకోకుండా పూర్తిగా ఇంటికే పరిమితం అయినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. కాగా రమేష్ పెద్ద కర్మ కార్యక్రమానికి మహేష్ కుటుంబసభ్యలు అందరూ వచ్చినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: