ఈ సినిమా కథ విషయానికొస్తే అనాధలుగా చిన్నప్పటినుంచి పెరుగుతారు సత్య (ఉదయ్ శంకర్), ప్రీతి (జియా శర్మ). ఒకానొక సందర్భంలో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారి, పెళ్లిదాకా వెళ్తుంది.. పెళ్లి తర్వాత వీరి మధ్య ఉన్న ప్రేమ తగ్గిపోయి తరుచు గొడవలు పడే స్టేజి కి వెళ్ళిపోతుంది. డబ్బు విషయమై ఈ గొడవలు జరుగుతుండగా సత్య చేపల వ్యాపారంలో పెట్టుబడి పెట్టి బాగా నష్టపోతాడు. ఈ సమయంలో మాయా (శ్రుతిసింగ్) అతని జీవితంలోకి ఎంటర్ అవుతుంది. టింగ్ యాప్ ద్వారా ఏర్పడిన ఈ పరిచయం వల్ల సత్య జీవితం ఊహించని సమస్యల్లో చిక్కుకుంటుంది. అసలు ఈ మాయ ఎవరు..? ఆమె వల్ల ఎదురైనా సమస్య ఏంటి..? ప్రీతీ తో తన జీవితం ఏవిధంగా సుఖంతమయ్యింది అనేదే చిత్ర కథ..
విశాఖపట్టణం నేపథ్యంగా సాగే ఈ కథ లో సత్య జీవితంలో జరిగే సంఘటనలను ఎలివేట్ చేయడానికి దర్శకుడు చాలా ప్రయత్నించాడు. ముందుగా సత్య జీవితంలోకి, ఆ తర్వాత మెల్లగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మాయ పాత్ర తో మంచి ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేసి సఫలమయ్యారు. వాళ్లిద్దరి మధ్య నడిచే ఛాటింగ్తో కథకు మలుపు లాంటిది అని చెప్పొచ్చు. విరామ సమయానికి మాయా హత్యకు గురవడం సినిమా టర్నింగ్ పాయింట్. పోలీసులు ఈ హత్య కేసును విచారించే ప్రక్రియ ఎంతో ఆసక్తి కరంగా ఉంది. ఈ క్రమంలో వచ్చే ఓ ట్విస్ట్ అందరిని థ్రిల్ కి గురి చేస్తుంది..హత్య కేసు నుంచి బయట పడేందుకు హీరో చేసే ప్రయత్నాలు, దాన్ని ఛేదించే క్రమంలో పోలీసులు చేసే పరిశోధనలతో ఉన్న సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి..
ఉదయ్ శంకర్ ఎప్పటిలాగే మంచి నటన కనపరిచాడు. కథకు తగ్గట్లుగా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. జియా శర్మ అందంతో పాటు అభినయం కూడా బాగుంది. ఉదయ్, జియా రెండు పాత్రలు నిజజీవితంలో తమని తాము చూసుకున్నట్లు ఫీల్ అవుతున్నారు ప్రేక్షకులు.. మాయ పాత్రలో శ్రుతి సింగ్ అందాలు ఒలికించింది. ఈ సినిమా కి ఈమె ప్రధాన ఆకర్షణ. సంగీత దర్శకులు కోటి, రఘుకుంచె, రవి ప్రకాష్, గిప్టన్.. తదితరులంతా పాత్రల పరిధి మేరకు నటించారు.రోషన్ సాలూర్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి.