విజయవాడలోని కృష్ణా కట్టలు, కాల్వ గట్లు ఇప్పుడు జనావాసాలుగా మారిపోయాయి. విజయవాడ నగరంలో అద్దెలు భరించలేని బడుగు జీవులు వీటిని ఆక్రమించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. నగరంలో చిన్నాచితకా పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇప్పుడు ఆ కాల్వగట్లు స్లమ్ ఏరియాల్లా తయారయ్యాయి.
కృష్ణా కట్టలు, కాల్వగట్లపై నివాసాల కారణంగా జలాలు కలుషితం అవుతున్నాయి. నదీప్రవాహాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందుకే వీటి ప్రక్షాళను జగన్ సర్కారు నడుంబిగించింది. కృష్ణానది కట్ట, కాల్వగట్లపై ఉంటున్న వారికి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. వారికి ఇళ్ల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. వారు కోరుకున్న ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
రెండు సెంట్ల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. నదీ పరివాహక ప్రాంతాలకు భంగం కలుగకుండా చూడాలని తెలిపారు. మున్సిపల్ శాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. మున్సిపాలిటీల్లో సదుపాయాల కల్పనపై సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. తాగునీరు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, మురుగునీటి శుద్ధి,పర్యావరణ పరిరక్షణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. కొనసాగుతున్న ప్రాజెక్టులు, చేపట్టాల్సిన కొత్త పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ స్కూళ్ల అభివృద్ధిపై కూడా సమీక్ష నిర్వహించారు.
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను పూర్తిగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. తాగునీరు, కరెంటు, రేషన్కార్డులు, పెన్షన్లు, ఆరోగ్యశ్రీపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఉండాలని సీఎం సూచించారు. తాగునీటి పైప్లైన్లు, డ్రైనేజీతో సంబంధం లేకుండా చూసుకోవాలన్నారు. ఉగాది నాటికి అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న జగన్ వాగ్దానం అమలైతే అంత కంటే కావాల్సిందేముంది పేదలకు.