కరోనా లేదా కోవిడ్-19 ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతుంది.. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా అనుమానిత కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొదట ఈ వైరస్ వుహాన్లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్ లో కొత్త వైరస్ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ కారణంగా వుహాన్లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్ను లండన్కు పంపించి పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనల్లో కరోనావైరస్ గా గుర్తించారు. ఇక ఆ తర్వాత ఈ వైరస్ ప్రపంచ దేశాలు ఎలా వ్యాపించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజురోజుకీ ఈ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. మంగళవారం హైదరాబాద్లో కరోనా పాజిటివ్ కేసు బయటపడిందని తెలిసిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. రాజకీయాలు.. సినిమాలు.. క్రికెట్ అన్నింటినీ కరోనా డామినేట్ చేసింది. కరోనా దెబ్బకు ఆఫీసులు, స్కూళ్లు సెలవులు ప్రకటిస్తున్నాయి. ఇక తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్కు కూడా కరోనా దెబ్బ తగిలింది. సియాటెల్కు చెందిన ఫేస్బుక్ కాంట్రాక్టర్కు కరోనా వైరస్ సోకింది. దీంతో తక్షణమే అలర్ట్ అయిన ఫేస్బుక్ సియాటెల్లోని తూర్పు, పశ్చిమ కార్యాలయాలను మార్చి 9 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించింది.
అలాగే ఈ విషయాన్ని ఉద్యోగులకు తెలియజేశామని, ప్రతీ ఒక్కరి ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామనీ, ప్రాజారోగ్య అధికారుల సలహాలను పాటిస్తున్నామని ఫేస్బుక్ ప్రతినిధి తెలిపారు. మరియు మార్చి 31 వరకు ఇంటి నుండే పని చేసేందుకు ప్రయత్నించమని ఉద్యోగులందరినీ కోరినట్టు వెల్లడించింది. ఇక ఇప్పటికే ఆన్లైన్ రీటైలర్ అమెజాన్ కూడా అమెరికాలో పనిచేస్తున్న తమ ద్యోగి కరోనా బారిన పడినట్టు అమెజాన్ ధృవీకరించిన సంగతి తెలిసిందే. కాగా అమెరికాలో కరోనావైరస్ బారిన పడిన కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా సియాటెల్లో ఈ రోజు 10 కొత్త కేసులు నమోదైనట్టు తెలుస్తోంది.