అవి వాస్తవానికి ఏపీకి చెందిన గ్రామాలు.. కానీ.. అవి మావేనని ఒడిశా అంటోంది.. ఇలా ఏపీ-ఒడిశా మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న ఈ గ్రామాల సమస్య నలుగుతోంది. వీటిని కొటియా గ్రామాలు అంటారు. ఒడిశా సరిహద్దుల్లోని ఈ గ్రామాలది వింత సమస్య. ఏకంగా సుప్రీంకోర్టు వద్దకు కూడా ఈ సమస్య వెళ్లింది. అయినా ఇంకా పరిష్కారం కాలేదు. ఈ సరిహద్దు గ్రామాలు విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఉన్నాయి.


తాజాగా ఈ గ్రామల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. జగనన్న విద్యాకానుక అమలు కోసం అధికారులతో కలిసి సాలూరు వైసీపీ ఎమ్మెల్యే రాజన్నదొర కొటియా గ్రామాలకు వెళ్లారు. అక్కడ ఒడిశాకు చెందిన ప్రజాప్రతినిధులు ఆయన్ను అడ్డుకున్నారు. కొటియా గ్రామాల్లోకి వెళ్లనిచ్చేది లేదన్నారు. జగనన్న విద్యాకానుక పంపిణీకి వెళ్లిన అధికారుల నుంచి పుస్తకాలు లాగేసుకున్నారు. చివరకు ఎమ్మెల్యేను కూడా అడుగు ముందుకు కదలనివ్వలేదు.


దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. చివరకు ఏపీ, ఒడిశా పోలీసు అధికారులు చర్చించుకుని.. సాలూరు ఎమ్మెల్యేకు నచ్చజెప్పారు. దీంతో ఆయనే వెనుదిరిగిరావాల్సి వచ్చింది. ఒడిశా తరచూ కవ్వింపు చర్యలకు దిగుతోందని వైసీపీ ఎమ్మెల్యే రాజన్న మండిపడుతున్నారు. తాము గిరిజనుల భద్రత కోసమే సంయమనం పాటిస్తున్నామని  రాజన్న అంటున్నారు. కొటియా గ్రామాల్లో ఒడిశా దూకుడుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని రాజన్న అన్నారు.


ఈ ఘటనకు సంబంధించి ఫొటో, వీడియో ఆధారాలున్నాయని.. న్యాయస్థానంలో తేల్చుకుంటామని  ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. ఒడిశా నేతలు కొండంగి, సారిక, ధనసరాయి, సంపంగిపాడు, కురుకుట్టి సర్పంచ్‌లకు డబ్బు ఆశ చూపి లోబరుచుకుంటున్నారని రాజన్న దొర ఆరోపించారు.  సాలూరు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే 34 కొటియా గ్రామాలను ఎలాగైనా గుప్పిటపట్టాలని  ఒడిశా ప్రయత్నిస్తోందని రాజన్న అన్నారు. ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ ఆనవాళ్లనే అక్కడ లేకుండా చేయడానికి దూకుడుగా వెళ్తోందని.. దీన్ని అడ్డుకుంటామని రాజన్న దొర అంటున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎన్నడో..?


మరింత సమాచారం తెలుసుకోండి: