ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న క‌డ‌ప జిల్లాలో రాజ‌కీయాలు ఇప్ప‌టిలా ఉండ‌వా?  ఇక‌పై.. దూకుడుగా ఉంటాయా?  టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌త్యేక దృష్టి పెట్టారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. క‌డ‌ప‌లో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాల‌కు భిన్న‌మైన రాజ‌కీయం ఇప్పుడు క‌నిపిస్తోంది. దీని వెనుక‌... టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు కీల‌కంగా చ‌క్రం తిప్పార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎలా అంటే.. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో క‌డ‌ప‌లో వైసీపీ విజ‌యం భారీగా న‌మోదైంది. ఇక్క‌డి మొత్తం 10 నియోజ‌క‌వ‌ర్గాల్లో 9 స్థానాల‌ను వైసీపీ ద‌క్కించుకుంటే.. ఒక‌టి మాత్రం టీడీపీ ఖాతాలో ప‌డింది.

అయితే.. ఒక్క‌స్థాన‌మే గెలుచుకున్నా.. ఐదేళ్ల కాలంలో క‌డ‌పలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు చం ద్రబాబు ప్ర‌య‌త్నించారు. అదేవిధంగా ఎండిపోయిన పొలాల‌కు నీటిని అందించేందుకు ప‌ట్టిసీమ  ద్వారా .. నీటిని అందించారు. దీనివ‌ల్ల క‌డ‌ప‌లో చాలా ఎక‌రాలు సాగుకు కూడా వ‌చ్చాయి. అదేస‌మ‌యం లో కొంద రు కీల‌క నాయకులకు ముఖ్యంగా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారికి మంత్రి పద‌వులు కూడా ఇచ్చారు. అంటే... ప‌రోక్షంగా జిల్లాకు చెందిన రెడ్డి వ‌ర్గానికి చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇచ్చారు. దీనిని బ‌ట్టి.. రెడ్డి వ‌ర్గానికి ఆయ‌న ఇస్తున్న ప్రాధాన్యంలో స‌గం కూడా ఇప్పుడు జ‌గ‌న్ ఇవ్వ‌డం లేద‌నేది ఇక్క‌డి రెడ్డి వ‌ర్గం ఆవేద‌న‌గా ఉంది.

అదేస‌మ‌యంలో 2019లో 10 ఎమ్మెల్యే సీట్ల‌ను కూడా వైసీపీకి క‌ట్ట‌బెట్టినా.. త‌మకు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని.. ఇక్క‌డి రెడ్డి నేత‌లు గుస్సాగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో అటు కాంగ్రెస్‌, ఇత‌ర పార్టీల్లోని రెడ్డి నేత‌ల‌తో ఇటీవ‌ల టీడీపీకి చెందిన రెడ్డి నాయకులు భేటీ అయి.. చంద్ర‌బాబు చెప్పిన‌ట్టుగా.. వారికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం ద‌క్కించుకుంటే.. ఖ‌చ్చితంగా న్యాయం చేస్తామ‌ని.. హామీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఇక్క‌డి రెడ్డి సామాజిక వ‌ర్గం పూర్తిగా జ‌గ‌న్‌ను పక్క‌న పెట్టాల‌ని భావిస్తోంది. దీంతో రెడ్లు ప్ర‌భావం చూపే దాదాపు 8 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గెలుస్తుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి.

ఈ ప‌రిణామం.. వైసీపీకి కూడా తెలిసింది. అయితే.. ఇప్ప‌టి వ‌రకు లేని విధంగా రెడ్లు అంద‌రూ ఏకం కావ‌డం.. టీడీపీకి అనుకూలంగా చ‌క్రం తిప్పాల‌ని నిర్ణ‌యించుకోవ‌డాన్ని వైసీపీ నాయకులు సీరియ‌స్‌గానే తీసుకుంటున్నారు. దీనిని స‌రిచేసేందుకు నియోజ‌వ‌ర్గాలకు చెందిన రెడ్డి నేత‌ల‌తో చ‌ర్చించే బాధ్య‌త‌ను విప్ గ‌డిక‌కోట శ్రీకాంత్‌రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని చ‌ర్చ సాగుతోంది. నిన్న మొన్న కూడా ఆయ‌న వారితో చ‌ర్చించార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో వైసీపీ వారిని ఎలా బుజ్జ‌గిస్తుంద‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అధికారంలో ఉండి కూడా త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఆవేద‌న రెడ్డివ‌ర్గంలో క‌నిపిస్తుండ‌డం.. వైసీపీలో గుబులు రేపుతోంద‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: