పెళ్లి... అది సాదాసీదా విషయం కాదు. ఓ భార‌త‌ జవాన్, ఓ పాకిస్తానీ యువతితో ప్రేమలో పడితే ఏం జ‌రుగుతుంది... అది దేశ భ‌ద్ర‌త‌నే క‌దిలించే అంశంగా మారితే.. చివ‌ర‌కు అది ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ వ‌ర‌కు వెళితే ఇది సినిమా క‌థ‌లా అనిపిస్తుందా.. కాదు రియ‌ల్ స్టోరీయే. ఓ పాకిస్తాన్ అమ్మాయి... సీఆర్పీఎఫ్ జ‌వాన్ వీడియో కాల్ పెళ్లి.. భార‌త్ లో కాపురం ఊహించ‌ని ట్విస్టుల‌తో మ‌లుపు తిరుగుతోంది. మ‌రి ఈ క‌థ‌లో ఏం జ‌రిగిందో తెలుసుకుందాం.  జమ్మూ జిల్లాలోని ఘరోటా ప్రాంతానికి చెందిన మునీర్ అహ్మద్, పాకిస్తాన్ పంజాబ్‌కు చెందిన మీనల్ ఖాన్ కు ఆన్‌లైన్ ప‌రిచ‌యం ఏర్ప‌డడం వీరు ప్రేమ‌లో ప‌డ‌డం జ‌రిగింది. వీరిద్ద‌రు 2024 మే 24న వీడియో కాల్ ద్వారా పెళ్లి ( నిఖా ) చేసుకున్నారు. ప్రేమ‌కు స‌రిహ‌ద్దులు ఉండ‌వు అనే న‌మ్మ‌కంతో చేసుకున్న ఈ వివాహం ఇప్పుడు ఆ జ‌వాన్ జీవితాన్ని త‌ల‌కిందులు చేసింది.


అయితే ఆ జ‌వాన్ భార్య మీనల్ ఖాన్ ఫిబ్రవరి 28న భారతదేశంలోకి షార్ట్ టర్మ్ వీసాతో ఎంట్రీ ఇచ్చింది. ఆమె వీసా గ‌డువు మార్చి 22న ముగిసింది. అయినా ఆమె దేశం విడిచి వెళ్ల‌లేదు. తాజాగా జ‌మ్మూకాశ్మీర్ లోని ప‌హ‌ల్గామ్ లో ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు చనిపోవడంతో భారత ప్రభుత్వం పాకిస్తానీ పౌరులపై కఠిన చర్యలు తీసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే వారిని వెన‌క్కు పంపాల‌నే నిర్ణ‌యం తీసుకుంది. ఇప్పుడు మునీర్ అహ్మ‌ద్, మీనల్ ఖాన్ వివాహం వెలుగులోకి వ‌చ్చింది. అత‌న్ని సీఆర్పీఎఫ్ విధుల నుంచి తొల‌గించింది.


అధికారులు చెపుతోన్న దాని ప్ర‌కారం మునీర్ త‌న పెళ్లిని సీక్రెట్‌గా ఉంచాడు. మీన‌ల్ వీసా గ‌డువు ముగిశాక కూడా ఆమెను భార‌త్‌లో ఉంచ‌డంతో అత‌డిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇదే దేశ భ‌ద్ర‌త‌కు సంబంధించిన అంశం అంటున్నారు. అయితే మునీర్ మాత్రం ఇది అన్యాయం అని.. ఒక జ‌వాన్‌గా ప్ర‌ధాని మోడీ, అమిత్ షాలు ఒక జ‌వాన్ గా త‌న‌కు న్యాయం చేయ‌డంలో క‌లుగ‌జేసుకోవాల‌ని కోరుతున్నాడు. తాను 2022 డిసెంబ‌ర్ 31నే త‌మ పెళ్లి విష‌యాన్ని సీఆర్పీఎఫ్ అధికారుల‌కు చెప్ప‌డంతో పాటు పాస్‌పోర్ట్, పెళ్లి సర్టిఫికేట్, నాకూ, మా తల్లిదండ్రులకూ చెందిన అఫిడవిట్లు సమర్పించ‌డంతో 2024 ఏప్రిల్ 30న హెడ్‌క్వార్టర్స్ నుంచి పెళ్లికి అనుమతి కూడా వచ్చిందంటున్నాడు.


పెళ్లి అనంతరం తన 72వ బటాలియన్‌లో డాక్యుమెంట్లు సమర్పించిన మునీర్, మీనల్ భారతదేశానికి వచ్చిన తర్వాత ఆమెకు లాంగ్ టర్మ్ వీసా కోసం అప్లై చేశాన‌ని కూడా చెపుతున్నాడు. తాను అన్నీ ప‌ర్‌ఫెక్ట్‌గానే చేశాన‌ని.. అయినా తనపై చర్యలు తీసుకోవడం తగదనీ, త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతున్నాడు. కాగా, ఈ కేసులో మినల్ ఖాన్‌ను దేశం వీడాల‌నే ఉత్త‌ర్వుల‌ను జమ్మూ కాశ్మీర్ హైకోర్టు నిలిపివేసింది. ఆమెకు 10 రోజుల పాటు భారత్‌లో ఉండేందుకు అనుమతి ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: