
ఉద్యోగ సంఘాలు చెబుతున్నదేమిటంటే — చంద్రబాబు సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన తొమ్మిది ప్రధాన హామీలలో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని. 16 నెలలుగా నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నప్పటికీ, ఇప్పుడు ఒకటే డీఏ ఇస్తామని చెప్పడం పూర్తిగా మోసపూరితమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “మిగిలిన డీఏలను పదవీ విరమణ తర్వాత ఇస్తామంటారా? అప్పుడు వాటితో మేము ఏమి చేసుకుంటాం? ఇప్పుడే అవసరమయ్యే డబ్బును రిటైర్మెంట్ తర్వాత ఇస్తే ఎంత నష్టపోతాం?” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు, పిఆర్సి కమిషనర్ నియామకంపై కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఉద్యోగుల్లో అసహనాన్ని పెంచుతోంది. గత కమిషనర్ను తొలగించి ఇప్పటివరకు కొత్తవారిని నియమించకపోవడం, ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై ఆసక్తి చూపడం లేదనే సంకేతమని విమర్శలు వినిపిస్తున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, “ఉద్యోగులకు నాలుగు డీఏల బకాయిలలో ఒక డీఏని మంజూరు చేస్తున్నాం. ఇది పండుగ కానుక” అని ప్రకటించారు. కానీ ఆ మాటలతో ఉద్యోగులు సంతోషించకుండా మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
“ఇది ఎక్కడి న్యాయం? ఎక్కడి కొత్త రూల్? పదవీ విరమణ తర్వాత డీఏ ఇవ్వడం అంటే మమ్మల్ని మోసం చేయడమే కదా?” అంటూ పెన్షనర్లు మండిపడుతున్నారు. “ఈ నిర్ణయం వల్ల దీపావళి వెలుగులు మాకు చీకటిగా మారిపోయాయి” అని తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టడానికి సిద్ధమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర నిరాశను కలిగించిందనే చెప్పాలి. ప్రజల్లో కూడా ఈ నిర్ణయం పట్ల చర్చలు ముదురుతున్నాయి — గతంలో ఇచ్చిన మాటలు ఇక చెల్లవు అన్నట్లు అవుతున్నాయి..“చంద్రబాబు ఉద్యోగులను నమ్మించి, చివరికి గొంతు కోశారా?” అని ప్రశ్నిస్తున్నారు.