బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు ఇప్పుడు జాతీయ రాజకీయాలకు దిక్సూచిలా మారాయి! ఈ ఫలితాలు.. రాబోయే ఎన్నికల ముందు వివిధ రాష్ట్రాల్లో ప్రజల నాడి ఎలా ఉందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇది కేవలం గెలుపోటముల లెక్క కాదు .. అధికార, ప్రతిపక్ష పార్టీల బలాబలాలను నిర్ణయించే 'మినీ రెఫరెండంస‌ గా నిలిచింది! ప్రాంతీయ పార్టీల దెబ్బ.. జాతీయ పార్టీలకు హెచ్చరిక! ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ 8 నియోజకవర్గాల తీర్పు అత్యంత ఆసక్తికరంగా, భిన్నంగా ఉంది: కాంగ్రెస్ ఊపు: తెలంగాణలోని జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తిరుగులేని విజయం దిశగా దూసుకుపోతున్నారు.
 

అలాగే రాజస్థాన్‌లోని అంటా నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ తన పట్టు నిలుపుకుంది. బీజేపీ సత్తా: ఒడిశాలోని నుపదలో బీజేపీ అభ్యర్థి భారీ మెజారిటీతో ముందంజలో ఉండగా, జమ్మూ కశ్మీర్‌లోని నాగ్‌రోటాలోనూ కాషాయం పార్టీ హవా కొనసాగుతోంది. ప్రాంతీయ శక్తులు: జాతీయ పార్టీలకు షాకిస్తూ.. ప్రాంతీయ పార్టీలు తమ సత్తా చాటుకున్నాయి. జార్ఖండ్‌లోని ఘాట్సిలాలో జేఎంఎం (JMM) అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. మిజోరంలోని డంపాలో ఎంఎన్‌ఎఫ్ (MNF) అభ్యర్థి విజయం సాధించి, ప్రాంతీయ పార్టీల పవర్‌ను నిరూపించారు. అలాగే పంజాబ్‌లోని టర్న్ టరన్లో ఆప్ (AAP) అభ్యర్థి లీడ్‌లో ఉండటం.. ఆ పార్టీకి గొప్ప బూస్ట్‌ను ఇస్తోంది. క్లారిటీ ఇచ్చిన కశ్మీర్ తీర్పు! జమ్మూ కశ్మీర్‌లో రెండు సీట్లలోనూ భిన్నమైన తీర్పు వచ్చింది.


బుడ్గంలో పీడీపీ (PDP) అభ్యర్థి ఆధిక్యంలో ఉండగా, నాగ్‌రోటాలో మాత్రం బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఇది కశ్మీర్ లోయ, జమ్మూ ప్రాంతాల మధ్య ఉన్న భిన్నమైన రాజకీయ ధోరణులను మరోసారి స్పష్టం చేసింది. మొత్తానికి, ఈ ఎనిమిది ఉప ఎన్నికల ఫలితాలు ఒకే పార్టీకి పూర్తిస్థాయిలో అనుకూలంగా లేవు. ఇది దేశ రాజకీయాలు ఒకే గొడుగు కింద లేవని, ఆయా రాష్ట్రాల ప్రజలు స్థానిక నేతలకు, ప్రాంతీయ పార్టీల అజెండాకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని నిరూపించింది. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు.. స్థానిక ప్రజల మనోభావాలను గుర్తించి, కొత్త వ్యూహాలను రచించాల్సిన అవసరాన్ని ఈ 'మినీ ఎలక్షన్ వార్' ఫలితాలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి!

మరింత సమాచారం తెలుసుకోండి: