అక్బర్ పాదుషా తన పరిపాలనలో భాగంగా ఒక గంటను దర్బారుకు సమీపంలో ఏర్పాటు చేశారు. కష్టమేదైనా కలిగినవారు ఆ గంటను మ్రోగిస్తే, పాదుషా వారు వచ్చి వారికి కలిగిన కష్టనష్టాలను విచారించి తగిన న్యాయం సమకూర్చి ఉండడం జరుగుతుంది. అందుకే ప్రజలు దానిని న్యాయ గంట అని ప్రశంసిస్తూ ఉంటారు.


ఒకనాడు ఒక ముసలి ఎద్దు ఆ గంట వద్దకు వచ్చి తన కొమ్ములతో గంట కున్న త్రాటిని చుట్టబెట్టి లాగుతూ గంటను మ్రోగించ సాగింది. అక్బరు పాదుషా వారు వచ్చి నోరులేని ఆ జంతువు లాగుతుండడం గమనించి దానికి కలిగిన బాధేమిటో చెప్పలేదని, దానికి ఏ విధమైన తీర్పును చెప్పలేకపోయారు. బీర్బల్ ను పిలిచి ఆ ముసలి ఎద్దు ఫిర్యాదు ఏమిటో తెలుసుకొని తగిన తీర్పును ఇవ్వమని చెప్పాడు.


బీర్బల్ ఆ ఎద్దును గంట నుండి విడిపించి దానివెనుక కొంత మంది నౌకర్ల ను పంపించేను. వెళ్లి వెళ్లి తన యజమాని ఇంటి ముందు ఆగింది. దానిని చూసి ఇంటి యజమాని తన్ని తరిమేసినా, తిరిగి ఇది ఇక్కడికే వచ్చిందని దానిని మరల తరిమి వేయబోయేను. అదే దాని ఫిర్యాదుకు గల కారణమని గ్రహించిన రాజభటులు రాజాజ్ఞగా వానిని వెంట తీసుకొని బీర్బల్ వద్దకు తీసుకెళ్లారు.

ఓయీ! దానిని ఎందువలన తరిమి వేయి చుంటివని ప్రశ్నించెను. మహాశయా ! ఇది ముసలిది అయిపోయినది ..పని పాటూ చేయలేకపోతున్నది. దీనిని పెంచటం వృధా ..దండగ అని ఊరిలోనికి తరిమివేశాను అన్నాడు. ఓయీ! ఇది వయసున్నప్పుడు ఎంతో కష్టపడి పనులు చేసింది. ఇప్పుడు ముసలిదైపోయిన  దీనికి తిండి పెట్టకపోవడం నీకు న్యాయమా అని అన్నాడు.. బీర్బల్..


అప్పుడు ఆ యజమాని మహాశయా! అక్కరకు ఉపయోగపడని దీనికి అలవిమాలిన ఖర్చు చేయుట నావల్ల కాదు అన్నాడు. మరి నీ తల్లిదండ్రులు నిన్ను పెంచి పెద్ద చేసి మీ ఇంటిలో వృద్ధులై ఉన్నారు కదా..! వారిని కూడా తరిమి వేస్తావా.. అని అడిగాడు. వాళ్లు నాకు జన్మనిచ్చి, నాకై శ్రమించిన వారి నెట్ల తరిమివేయాగలనని యజమాని అనగా ,నీ తల్లిదండ్రుల వలె నిన్ను పెంపొందచేసిన ఆ ఎద్దును కూడా పోషించుట మీ విధి అని బోధించి, ఎద్దును రక్షించమని, మూగజీవికి న్యాయం సమకూర్చిన బీర్బల్ ను అక్బర్ వారు తగురీతిగా సత్కరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: