సంక్రాంతి సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటుతున్నాయి. తొలిరోజు భోగి వైభోగంగా జరుపుకున్నారు. అయితే ఈ సంబరాల్లో ఆనందంతో పాటు.. మన సంస్కతి సంప్రదాయాలను కూడా కాపాడుకునే ప్రయత్నం చేయాలి.
తరతరాల నుంచి మనం కాపాడుకుంటూ వస్తున్న సంప్రదాయాలు, ఆనవాయితీలను ముందు తరాలకు అందించాలి. అలాంటి వాటిలో ఒకటి పితృ దేవతల సంతర్పణ. సంక్రాంతి నాడు మనం వండుకున్న పదార్ధాలను మనం భుజించడమే కాదు.
మన పితృదేవతల సాక్షిగా ఒకరిని ఇంటికి ఆహ్వానించి.. వారికి ఇతోధికంగా సత్కరించి భోజనం పెట్టాలి. ఇలా చేయడం ద్వారా పై లోకాలలో ఉన్న మన పితృదేవతల రుణం తీరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. నిజానికి పండగ నాడు ఎవరూ ఎవరి ఇంటికీ భోజనాలకు రారు.
అందుకే ఇళ్లలో పూజను ఏర్పాటు చేసుకుని ఒక్కరినైనా వెతికి పట్టుకుని వారికి భోజనం పెట్టాలి. ఇలా చేయడం ద్వారా అటు పితృదేవతలు సంతోషిస్తారు. అదే సమయంలో లక్ష్మీదేవి కూడా ఆనందిస్తుందని అంటారు. మరి సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవి ఆనందిస్తే మన ఇంట సిరులు పండవా మరి.