దేశంలో మార్చి నెల నుంచి లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి నుంచి కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో మార్చి నెల దీని ప్రభావం పెరగడంతో లాక్ కౌన్ ప్రకటించింది కేంద్రం. అప్పటి నుంచి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ప్రజలకు పరిస్థితుల గురించి చెబుతూ.. వారికి ధైర్యాన్ని నింపుతున్నారు. అయితే ఆకలి ఎవరి మాట వినదు.. అందుకే పేద ప్రజల కోసం కేంద్రం కొత్త ప్యాకేజీలు తీసుకు వస్తుంది. తాజాగా ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం పంపించిన పప్పులపై పంజాబ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించడమే కాదు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రజలు తినే పప్పేనా? ఈ పప్పులు బూజు పట్టాయని, పక్షుల రెట్టలు ఉన్నాయని ఇలాంటి పప్పు పంపిచడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించింది? అంతేకాకుండా వీటి నుంచి దుర్వాసన వస్తోందని తెలిపింది.
దాదాపు 45 మెట్రిక్ టన్నుల పప్పులను కేంద్ర ప్రభుత్వానికి పంజాబ్ ప్రభుత్వం తిప్పి పంపింది. అంతకుముందు మొహాలీ జిల్లాలో ఈ పప్పులను ప్రజలకు పంజాబ్ ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో, వాటిని లబ్ధిదారుల నుంచి తిరిగి తీసుకుని, పరీక్షించింది. అక్కడ బాధితులు అన్నట్లుగా నే బూజు పట్టి ఉందని నిర్ధారించారు. ఈ పప్పులను తనిఖీ చేయకుండా తీసుకుని, ప్రజలకు పంపిణీ చేయడానికి అనుమ తించిన ఆహార శాఖ అధికారులపై దర్యాప్తుకు పంజాబ్ ప్రభుత్వం ఆదేశించింది.