హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శంషాబాద్ సమీపంలో ఉన్న తొండుపల్లి టోల్‌గేట్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఈ టోల్‌గేట్ దిశ హత్యాచార ఘటన సమయంలో బాగా చర్చల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోల్‌‌గేట్ సమీపంలోనే దిశ తన వాహనాన్ని తీసుకెళ్లేందుకు వచ్చి కామాంధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయింది. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే ఇప్పుడు మరోసారి తొండుపల్లి టోల్‌గేట్ వార్తల్లో నిలిచింది. భారీ బంగారం చోరీ కేసు ఛేదనకు వేదిక అయింది. తమిళనాడులోని హోసూరు ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో సుమారు రూ.7 కోట్ల విలువైన బంగారం దొంగిలించిన గ్యాంగ్.. తెలంగాణ మీదుగా వెళ్తూ సరిగ్గా ఈ టోల్‌గేట్ వద్దే సైబరాబాద్ పోలీసులకు పట్టుబడింది. భారీ చోరీ కేసును సీరియస్‌గా తీసుకున్న తమిళనాడు క్రిష్ణగిరి పోలీసులు నిందితులు తెలంగాణ, కర్ణాటక మీదుగా పారిపోయే అవకాశం ఉందని అనుమానించి వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం అందించారు.




తమిళనాడు పోలీసుల సమాచారంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషరేట్ల పరిధిలోని పోలీసులు అప్రమత్తమయ్యారు. జాయింట్ ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. నగర శివారుల్లోని టోల్‌గేట్లు, జాతీయ రహదారులపై నిఘా ఉంచారు. నిందితుల వద్ద ఆయుధాలు ఉన్నాయన్న సమాచారంతో సాయుధులైన పోలీసులను మోహరించారు. ఈ రోజు తెల్లవారుజాము సమయంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని తొండుపల్లి టోల్‌గేట్ వద్ద కారులో వెళ్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బంగారం కంటైనర్‌లో వెళ్తోందని సమాచారం ఇవ్వడంతో మేడ్చల్ పరిధిలో కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. భారీ చోరీ కేసును చాకచక్యంగా ఛేదించిన అనంతరం సైబరాబాద్ సీపీ సజ్జనార్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఏడు కోట్ల రూపాయల విలువైన బంగారం చోరీ కేసును ఛేదించినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేశామని.. మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ సిబ్బంది చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: