దేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మరోవైపు కొత్త వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో అరుదైన లెఫ్టోస్పిరోసిస్ వ్యాధి కేసు నమోదైంది. గత ఏడాది రాష్ట్రంలో ఈ వ్యాధి కేసులు నాలుగు నమోదు కాగా ఈ సంవత్సరం ఒక కేసు నమోదైంది. మహానగరాల్లోని మురికివాడల్లో సాధారణంగా ఈ వ్యాధి కేసులు నమోదవుతాయి. కానీ రాష్ట్రంలో అదిలాబాద్ జిల్లాలో సైతం ఈ తరహా కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం.
 
గత సంవత్సరం రాష్ట్రంలో లెఫ్టోస్పిరోసిస్ వ్యాధి కేసులు నాలుగు నమోదు కాగా నాలుగు కేసులు అదిలాబాద్ జిల్లాలోనే నమోదయ్యాయి. ఈ సంవత్సరం కూడా అదిలాబాద్ జిల్లాలో ఈ వ్యాధి కేసు నమోదు కావడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. అయితే ఈ వ్యాధికి చికిత్స అందించడం పెద్దగా కష్టం కానప్పటికీ సకాలంలో వ్యాధి లక్షణాలను గుర్తించడం ఎంతో అవసరం. పచ్చకామెర్ల బారిన పడిన వారిలో కనిపించే లక్షణాలే ఈ వ్యాధిలో కూడా కనిపిస్తాయి.
 
ఎవరైతే ఈ వ్యాధి బారిన పడతారో వారి కళ్లు పచ్చ రంగులో కనిపిస్తాయి. అయితే ఈ వ్యాధికి పచ్చ కామెర్లకు తీసుకునే చికిత్స తీసుకుంటే మరీ ప్రమాదం. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే కిడ్నీ, కాలేయం, ఇతర అవయవాలకు సంబంధించి సమస్యలు ఏర్పడతాయి. సకాలంలో సమస్యను గుర్తించలేకపోతే ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువ. కుక్కలు, పందులు, పిల్లులు, ఎలుకల మూత్రం వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది.
 
జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, చలి, వాంతులు ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. వైద్యుల సలహాలు, సూచనల మేరకు మందులు వాడితే ఈ వ్యాధి నయమవుతుంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో చాలా ప్రాంతాలలో నీరు నిలిచిపోవడం జరుగుతుంది. నీరు నిలిచిపోవడం వల్ల నీటిలో జంతువుల మూత్రం కలిస్తే ఆ నీటిని తాకిన వారు ఈ వ్యాధి బారిన పడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: