భూ ప్రకంపనల కారణంగా మూడు కొండచరియలు విరిగిపడగా కొన్ని ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అలాగే కొన్ని వంతెనలు దెబ్బతిన్నాయి. ఇక ఇదే చోట గత గురువారం మధ్యాహ్నం కూడా 5.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. సులవేసి దీవుల్లో వచ్చిన ఈ భారీ భూకంపం రిక్టర్ స్కేల్పై ఆరు పాయింట్ రెండుగా నమోదైంది. సులవేసి దీవిలోని మముజుకి దక్షిణంగా 36 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
మృతుల్లో వెస్ట్ సులవేసి రాష్ట్రంలోని మముజు నగరంలో 34, దక్షిణ ప్రాంతంలో మరో తొమ్మిది మృతదేహాలను వెలికి తీశారు. ఎంత మంది ఆచూకీ గల్లంతయ్యిందన్న విషయం తమకు తెలియదని అధికారులు చెబుతున్నారు. పూర్తిగా కూలిపోయిన ఇంటి శిధిలాల కింద చిక్కుకున్న ఎనిమిది మంది కుటుంబ సభ్యులను వెలికి తీయడానికి సహాయ సిబ్బంది ప్రయత్నించారు. .రెండున్నరేండ్ల క్రితం సంభవించిన సునామీ వల్ల వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2018 లో కూడా ఇక్కడ 6.2 తీవ్రతతో భూకంపం రావడంతో సునామీ కూడా వచ్చి వేలాది మంది మృతి చెందారు. మళ్లీ ఇప్పుడు ఇలా భూకంపాలతో ఇండోనేషియా జనం అల్లాడిపోతున్నారు.