సాధారణంగా గోదావరికి వరదలు వచ్చిన సమయంలో ఈ ప్రాంత వాసులు బోట్లు, మర పడవల్లొ తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం వైపు తమ అవసరాల నిమిత్తం వెళతారు. ప్రస్తుతం దేవీపట్నం మండలం కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో అటు వైపు వెళ్లడానికి ఆస్కారం లేకుండా పోయింది. పోనీ దిగువకు అంటే పోలవరం మండల కేంద్రం వైపు వద్దామనుకుంటే ప్రాజెక్టు స్పిల్ వే నిండా నీరుంది. మరోవైపు ఎత్తైన కొండలు, దట్టమైన అడవీ ప్రాంతం. ఇలా అన్ని వైపుల నుంచి నిర్వాసితులకు దారులు మూసుకుపోయాయి. దాంతో అక్కడ వారంతా ప్రాణ భయంతో వణికిపోతున్నారు.
ప్రస్తుతం గోదావరికి వచ్చింది చిన్నపాటి వరదే. కానీ కాపర్ డ్యామ్ ను మూసివేయడంతో గోదావరి నీరు వెనుకకు ఎగదన్నుతుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. బ్యాక్ వాటర్కు తోడు వరద నీరు జతకావడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పుడు ఆ నీరంతా గ్రామాల అంచుల వరకు చేరింది. దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నిర్వాసిత గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. న్యాయపరంగా ప్రభుత్వం నుండి తమకు అందవలసిన నష్టపరిహారాన్ని అందజేస్తే మాకు మేము గా గ్రామాలు ఖాళీ చేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. అధికారులు మాత్రం వచ్చే నెలాఖరుకల్లా అందరికీ పరిహారం అందజేస్తామని చెబుతున్నారు. మరి ఆ మాటను అధికారులు నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.