రాజులకు ఆస్థానంగా గుర్తింపు పొందిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కన్‌ఫమ్‌గా పోటీ చేస్తారనే ప్రచారంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర హల్చల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మకు టికెట్ ఇవ్వాలంటూ వారు నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ పాంప్లేట్స్ తగలబెట్టారు. ఇప్పటికే పలువురు నాయకులు తమ పదవులకు రాజీనామా చేయడం జరిగింది. వర్మకు టీడీపీ టికెట్ ఇవ్వకపోతే 2014లో లాగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకుంటామన్నారు టీడీపీ కార్యకర్తలు.ఇక ఆందోళన చేస్తున్న కార్యకర్తలను సముదాయించారు మాజీ ఎమ్మెల్యే వర్మ. చంద్రబాబు నాయుడుపై నమ్మకం ఉందని, ఎవరూ తొందరపడొద్దన్నారాయన. పిఠాపురం టికెట్ తనకే వస్తుందన్న ధీమా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి రాదు అనే సంకేతాలు రావడంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అలాగే కన్నీళ్లు పెట్టుకున్నారు. భార్యాభర్తలిద్దరూ కూడా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకోవడం వర్మ మద్దతుదారులు తట్టుకోలేకపోతున్నారు.పిఠాపురం టికెట్‌ వర్మకే ఇవ్వాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు రెండు మూడు రోజులుగా అత్యవసర సమావేశాలు పెట్టుకున్నారు.


 గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన వర్మ మరోసారి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని ఆయన మద్దతుదారులు తెలుపుతున్నారు. అయితే పిఠాపురం టికెట్‌ తనకే దక్కుతుందని వర్మ ఎంతో విశ్వాసంగా ఉన్నారు.ఇక పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఓట్లు 90 వేలకు పైగా ఉన్నాయి. దీంతో పవన్‌ కళ్యాణ్ సునాయాసంగా ఇక్కడ గెలుస్తారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.అలాగే మరోవైపు హస్తినలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై ఇంకా క్లారిటీ రాలేదు. బీజేపీ హై కమాండ్‌తో పవన్‌, చంద్రబాబు నాయుడు జరిపిన చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సీట్ల పంపకంపైనా ఇంకా ఏకాభిప్రాయం వెలువడలేదు. ఇప్పటికే టీడీపీ జనసేన కలిపి మొత్తం 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించుకున్నాయి. బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారనే దానిపై క్లారిటీ ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలో పొత్తులు, సీట్ల పంపకంపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతే పవన్‌ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే సస్పెన్స్‌ వీడుతుంది. అప్పటి దాకా పిఠాపురంలో టీడీపీ-జనసేన నేతల మధ్య అలజడి కొనసాగే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: