ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం ఇటీవల వేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. వ‌రుసగా ఏడు సార్లు విజయం సాధించిన చంద్రబాబు, 2024 ఎన్నికల త‌ర్వాత‌ మరింత శ్రద్ధతో తన నియోజకవర్గంపై దృష్టి సారించారు. గతంలో మాదిరి కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా, నిరంతర అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. వాస్త‌వానికి 2019 ఎన్నిక‌ల్లో కుప్పంలో చంద్ర‌బాబు మెజార్టీ గ‌త రెండున్న‌ర ద‌శాబ్దాల్లో ఎప్పుడూ లేనంత‌గా 30 వేల‌కే ప‌రిమిత‌మైంది. కొన్న రౌండ్ల‌లో చంద్ర‌బాబు వెన‌కంజ వేశారు కూడా..! ఇక మ‌ధ్య‌లో స్థానిక ఎన్నిక‌లు, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ టీడీపీ చిత్తుగా ఓడిపోయింది.


ఎన్నికల సమయంలో వైసీపీ తరచూ చేసిన విమర్శలు, ఆ పార్టీ కుప్పంలో పాగా వేయాలన్న వ్యూహాలకు చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి బలమైన సమాధానం ఇచ్చారు. ఎన్నికల ముందు భువనేశ్వరి పర్యటనల ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారం చూపేందుకు హామీ ఇవ్వడం, ఎన్నికల తరువాత చంద్రబాబు స్వయంగా కీలక పథకాలను ప్రారంభించడం గణనీయమైన మార్పుకు దారితీసింది. ముఖ్యంగా సూర్యఘర్ పథకం ద్వారా కుప్పం ప్రజలకు విద్యుత్ ఖర్చుల భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో, ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో చేతివృత్తులను ప్రోత్సహించడం, మహిళలకు కుట్టు యంత్రాలు, యువతకు కంప్యూటర్లు రుణాలపై అందించడం ద్వారా ఇంటికో ఆదాయ వనరు సృష్టిస్తున్నారు.


విద్యా ప్రోత్సాహక చర్యలు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా కుప్పంలో రెండు ప్రధాన పరిశ్రమల ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం స్థానికులకు మరింత ఉత్సాహాన్నిస్తోంది. ఈ రెండు పరిశ్రమల కోసం సుమారు 8 వేల కోట్ల పెట్టుబడులు రానుండగా, దాదాపు 5 వేల మందికి పైగా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రత్యేకంగా పండ్ల గుజ్జు (పల్ప్) పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం వ్యూహాత్మక చర్యగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న మార్కెట్ సమస్యలు ఇకపై తగ్గే అవకాశం ఉంది. పంటకు తగిన ప్రాసెసింగ్ సదుపాయాలు లభించడం ద్వారా రైతులు లాభపడతారని అంచనా. ఈ పరిశ్రమలు ఏర్పడితే కుప్పం మాత్రమే కాకుండా మొత్తం జిల్లా కేంద్రంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.


అభివృద్ధి పరంగా రహదారుల నిర్మాణం, తాగునీటి సరఫరా వంటి ప్రాజెక్టులు వేగంగా సాగుతున్నాయి. కుప్పానికి ఇప్పటికే నీరు అందించడంతో స్థానిక ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సమగ్ర అభివృద్ధి చర్యలు కుప్పాన్ని ఏపీలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా నిలబెట్టే మార్గంలో ఉన్నాయని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: