ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి హై వోల్టేజ్ డ్రామా మొదలైంది. నకిలీ మద్యం కేసులో పెద్ద కుట్ర రచ్చ రేపిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇప్పుడు కిందామీదా పడుతున్నారు. సిట్ విచారణ మొదలయ్యేలోపే మీడియా ముందుకొచ్చి సవాళ్లతో రచ్చ చేస్తున్నారు. టీవీ9లో కూర్చుని లై డిటెక్టర్ టెస్ట్‌కు రెడీ అంటున్నారు. తిరుపతి గుళ్లో ప్రమాణం చేద్దామంటున్నారు.. విజయవాడ కనకదుర్గ గుళ్లో ప్రమాణం చేద్దామంటున్నారు. ఈ అతి రియాక్షన్‌ చూసి వైసీపీ నేతలే “ఇప్పుడు చేతిలో ఉన్న అన్ని ఆప్షన్స్ వాడేస్తున్నాడు.. ఎందుకంటే కేసు గట్టిగా ఉంది” అంటున్నారు. జనార్ధన్ రావు అరెస్టుతో కేసు మలుపు తిరిగింది. సిట్ అధికారులకు ఈ కేసు అప్పగించిన వెంటనే వారు తమ కార్యచరణ ప్రారంభించనున్నారు. మొదట జనార్ధన్ రావును కస్టడీలోకి తీసుకుని విచారణ జరపనున్నారు.
 

ఇక అక్కడి నుంచే జోగి రమేష్ వైపు దర్యాప్తు దారి మళ్లడం ఖాయం అని సమాచారం. ఆయన ఫోన్లు, కమ్యూనికేషన్, సీసీటీవీ ఫుటేజ్ అన్నీ సీజ్ చేయబడతాయి. లావాదేవీల ట్రేసింగ్ ద్వారా అసలు కుట్ర వెనుక ఉన్న లింకులు బయటపడతాయని సిట్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఏదైనా అవినీతి, అక్రమం జరిగినా ప్రభుత్వం దానిపై మెల్లగా వ్యవహరించిన సందర్భాలున్నాయి. కానీ ఈసారి విషయం చాలా సీరియస్ - నేరుగా ప్రభుత్వంపైనే కుట్ర అనే ఆరోపణ. ఇది సాధారణ విషయం కాదు. అందుకే ఈ కేసు మీద అధికార యంత్రాంగం గట్టిగా పట్టు పట్టినట్లు తెలుస్తోంది. జోగి రమేష్ లాంటి కీలక నేతపైనా చట్టబద్ధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.



చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన దాడి కేసు సమయంలో కూడా చట్టపరమైన మార్గంలోనే ఆయనకు అవకాశాలు ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం “దొరికిపోయాడు” అన్నట్టే అనిపిస్తోందని వైసీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అందుకే జోగి రమేష్ ఇప్పుడు మీడియా ముందుకొచ్చి సవాళ్లు విసురుతూ, ప్రమాణాలు చేస్తూ చివరి ప్రయత్నం చేస్తున్నాడన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఒక్కసారి సిట్ విచారణ మొదలయితే ఆయనకు బయటపడే అవకాశం తక్కువగానే ఉందని వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఒకప్పుడు పార్టీ తరఫున గట్టిగా మాట్లాడిన జోగి రమేష్ - ఇప్పుడు తనకే కఠినమైన శిక్ష తప్పదని తెలిసి, మీడియా మైక్ ముందు ఆగ్రహం చూపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ కేసు రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలను కుదిపేయడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: