కర్నూలు జిల్లాలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశాన్నంతటినీ తీవ్ర విషాదంలో ముంచేసింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో దాదాపు 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాద దృశ్యాలు చూసిన వారందరూ గుండెలు పిండేసుకున్నట్లయ్యింది. వివరాల్లోకి వెళితే — హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు బయలుదేరిన వీ  కావేరి ట్రావెల్స్‌ ప్రైవేట్‌ బస్సు రాత్రి సుమారు 42 మంది ప్రయాణికులతో బయలుదేరింది. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కర్నూలు జిల్లా పరిధిలో ఈ బస్సు వేగంగా వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న ఒక బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న క్షణంలోనే బైక్‌ పేలిపోవడంతో మంటలు ఒక్కసారిగా బస్సును చుట్టుముట్టాయి. నిమిషాల్లోనే బస్సు అగ్నికి ఆహుతై భయంకర దృశ్యం నెలకొంది. అప్పటి పరిస్థితిని వివరించిన ప్రత్యక్ష సాక్షులు కన్నీరు మున్నీరయ్యారు. “మేమంతా నిద్రలో ఉన్నాం. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. క్షణాల్లోనే బస్సు మొత్తం మంటల్లో కూరుకుపోయింది. అందరూ ప్రాణాల కోసం పరుగు తీశారు. ఎవరికి వారు తలుపులు తెరవడానికి ప్రయత్నించారు కానీ పొగతో ఏమీ కనిపించలేదు. కొందరు అద్దం పగలగొట్టి దూకారు, మరికొందరు మంటల్లో చిక్కుకున్నారు. ఆ కేకలు, ఆ అరుపులు ఇప్పటికీ చెవుల్లో మోగుతున్నాయి…” అంటూ ఒక బతికిన ప్రయాణికుడు వణుకుతూ వివరించాడు.

ఆయన ఇంకా చెప్పిన వివరాల ప్రకారం – “నేను అద్దం పగలగొట్టి బయటకు దూకాను. నా వెంట ఇద్దరు యువకులు కూడా బయటకు దూకారు. కానీ మిగతావారిని రక్షించలేకపోయాం. బస్సు లోపల మొత్తం మంటల్లో మునిగిపోయింది. బైక్‌ ఢీకొన్న వెంటనే మంటలు బస్సును ఆవరించడంతో అందరూ గందరగోళానికి గురయ్యారు.” అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు, ఫైర్‌ ఇంజిన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నప్పటికీ అప్పటికే ఎక్కువ మంది దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలు కాలిపోవడంతో గుర్తించడం కూడా కష్టంగా మారింది.

ప్రమాదానికి కారణం బస్సు అధిక వేగం, అలాగే బైక్‌ను గట్టిగా ఢీకొట్టడమేనని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో తెలిపారు. మరణించినవారిలో ఎక్కువ మంది దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్‌ వచ్చి తిరిగి బెంగళూరుకు వెళ్తున్న ఉద్యోగులు, విద్యార్థులుగా గుర్తించారు.ఈ ఘటనతో కర్నూలు జిల్లా శోకసంద్రంగా మారింది. బస్సు మిగిలిన భాగాలు, కాలిన వస్త్రాలు, వ్యక్తిగత వస్తువులు చూసిన ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తిరిగాయి. మంటల్లో చిక్కుకున్న వారి కేకలు, చుట్టూ వ్యాపించిన మంటల ఆవిరి — ఆ దృశ్యాలు చూసిన వారిని విపరీతంగా కుదిపేశాయి .ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: