సంక్రాంతి అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. సంక్రాంతి మూడు రోజుల పండుగ. మొదటి రోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజున కనుమ పండుగ జరుపుకుంటారు. దేశవ్యాప్తంగాను ఈ పండగకు ప్రాధాన్యత ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వచ్చిందంటేనే గొబ్బి పాటలు, గంగిరెద్దులు, రథం ముగ్గులు, హరిదాసుల కీర్తనలు, భోగిమంటలు, బొమ్మల కొలువులు, పిండి వంటలు, కొత్త దుస్తులు.. వాటిని ధరించి చూడముచ్చటగా అలంకృతమైన ఆడపడుచులు కనిపిస్తారు. అలాగే ఈ పండగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాల్లో పేర్లు వేరైనా చాలా పవిత్రంగా జరుపుకుంటారు. దీ నిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ,కర్ణాటక రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అని తమిళనాడులో పొంగల్, పంజాబ్ లో లోహిరి, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఉత్తరయన్ అని పిలుస్తారు.
ఇక కర్నాటక, కేరళలోనూ దీనిని పెద్దపండుగగా చేసుకుంటారు. అలాగే సంక్రాంతి రోజున ప్రతి ఇంటీ ముంగిలీలో రంగవల్లులు శోభాయమానంగా కనిపిస్తాయి. ప్రకృతి పట్ల కృతజ్ఞత, ప్రేమను ప్రకటించే పండుగల్లో సంక్రాంతికి ప్రాధాన్యముంది. పంటలే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న నేపధ్యంలో కొత్త పంట చేతికి వచ్చి ధాన్యరాశులలో చేరేది ఈ రోజుల్లోనే. దీంతో సంక్రాంతిని అతిపెద్ద పండగగా చెబుతుంటారు.