
వినాయకుడి పండుగ అంటే చాలు ..ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది పిండి వంటలు. వాటిలో ముఖ్యంగా గుర్తుచేసేది లడ్డు. ఇతర వంటకాలు చేసినా చేయకపోయినా ఖచ్చితంగా లడ్డూను మాత్రం నైవేద్యంగా సమర్పిస్తారు. దానికి కారణం ఏమిటంటే, లడ్డు ఆయనకు అత్యంత ప్రీతికరమైనది. గణపయ్యకు లడ్డు ఇష్టంగా మారడానికి కారణం శివపార్వతులతో సంబంధం ఉన్న ఒక పురాణకథ.
పురాణాల ప్రకారం.. ఒకసారి శివపార్వతులు కార్తికేయుడు మరియు వినాయకుడి మధ్య ఒక పోటీ పెట్టారు. “ప్రపంచాన్ని మూడుసార్లు ప్రదక్షిణం చేసినవారే విజేతలు” అని వారు నిర్ణయించారు. కార్తికేయుడు వెంటనే తన మయూరంపై ఎక్కి ప్రపంచాన్ని చుట్టేందుకు బయలుదేరాడు. అందరూ కూడా కార్తికేయుడే గెలుస్తాడని భావించారు. కానీ వినాయకుడు మాత్రం శాంతంగా ఆలోచించాడు. ఆపై తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు – “ఇదేంటి? వినాయకుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు?” అని ఆలోచిస్తారు. అప్పుడు గణపయ్య అన్నాడు..“తల్లిదండ్రులే నా ప్రపంచం. ఈ లోకంలో వారికంటే మించిన ప్రపంచం ఇంకేది ఉంటుంది?” అని చెప్పగానే అందరు మత్రముగ్దులు అయిపోతారు. ఆయన బుద్ధి, జ్ఞానాన్ని చూసి శివపార్వతులు సంతోషించారు. ఆయనకు ప్రసాదంగా అప్పుడు లడ్డూను ఇచ్చారు. అప్పటినుంచి లడ్డు గణపయ్యకు అత్యంత ఇష్టమైన నైవేద్యంగా మారింది. భోజనంలో ఏది ఉన్నా లేకపోయినా, లడ్డు మాత్రం తప్పనిసరిగా ఉండాలనే ప్రత్యేక స్థానం పొందింది. ఇప్పటికి కూడా ఆయనకు పూజ చేసుకున్న వారు లడ్డునే ప్రసాదంగా పెడుతుంటారు..!!