గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ఫ్లో , అవుట్ ఫ్లో 6,19,825 క్యూసెక్కులు ఉందని అంటున్నారు, వరద ముంపు ప్రభావిత మండలాల అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది, అందుకే ముందస్తుగా అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దింపారని అంటున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు పేర్కొంటూ బోట్లు,మోటార్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని కూడా ఆయన ప్రకటన విడుదల చేశారు. మరో పక్క కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద నీరు భారీగా చేరుతోందని అంటున్నారు.