ఒకప్పుడు యూత్ ఫుల్ మూవీస్కు కేరాఫ్ అడ్రస్ గా మారిన సంచలన దర్శకుడు తేజ తరువాత పూర్తిగా గాడి తప్పాడు. తేజ నుంచి వచ్చిన సందేశాత్మక చిత్రాలు బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టడంతో ఆయన కెరీర్లో గ్యాప్ వచ్చింది. చాలా రోజుల తరువాత రానా హీరోగా నేనే రాజు నేనే మంత్రి సినిమా తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు తేజ. అయితే ఆ తరువాత చేసిన సీత కూడా నిరాశపరచటంతో మరోసారి ఇబ్బందుల్లో పడ్డాడు. దీంతో మరోసారి గ్యాప్ తీసుకొని రెండు సినిమాలను ఒకే సారి ప్రకటించాడు.
శనివారం తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు తేజ. ఈ ప్రత్యేక సందర్భంలో, ఆయన తన తదుపరి రెండు సినిమాల టైటిళ్లనూ, వాటి హీరోలనూ ప్రకటించారు. ఒక మూవీలో గోపీచంద్, మరో సినిమాలో రానా హీరోలుగా నటించనున్నారు.
ఈ సినిమాల కోసం ఆయన 'రాక్షస రాజు రావణాసురుడు', 'అలిమేలు మంగ వెంకట రమణ' అనే ఆసక్తికర టైటిళ్లను రిజిస్టర్ చేయించారు. అయితే, ఆసక్తికరమైన విషయమేమంటే, హీరోలు సహా ఎవరి పేర్లనూ ప్రస్తావించకుండా ఈ సినిమాల పోస్టర్లను తేజ విడుదల చేశారు.
దాంతో రానాతో చేసే మూవీ ఏది? గోపీచంద్ నటించే సినిమా ఏది?.. అనే విషయాన్ని ఆయన ప్రస్తుతానికి సస్పెన్సులో ఉంచారు. ఈ సినిమాల నిర్మాతలనూ, వాటిలో నటించే తారాగణాన్నీ త్వరలోనే తేజ ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆయన ఈ సినిమాల స్క్రిప్టుల్ని పూర్తి చేశారు.
'జయం' చిత్రంతో గోపీచంద్ కు పెద్ద బ్రేక్ ఇచ్చిన తేజ, 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో రానాకు మరపురాని హిట్ ను అందించిన తేజ మరోసారి అదే హీరోలతో మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే రానాతో రాక్షస రాజ్యంలో రావణాసురుడు, గోపిచంద్తో అలిమేలు వంగ వెంకట రమణ సినిమాలు తెరకెక్కించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.