పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే అభిమానులకు పండగ వాతావరణం. ఇప్పుడు “ఓజీ” రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ ఆత్రుతకు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కొత్త జిఓ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటల నుంచే రూ. 800 ప్రత్యేక రేట్‌తో షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది తెలంగాణ. ఈ వార్త విన్న వెంటనే ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా ఫెస్టివల్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. కానీ తెల్లవారుఝామున 4 నుంచి 9 గంటల మధ్య ఎక్స్‌ట్రా షోలుకి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం పెద్ద అయోమయానికి దారి తీసింది. అంటే గరిష్టంగా 5 షోలు మాత్రమే వేసుకోవాల్సి వస్తుంది. ఇంత క్రేజ్ ఉన్న సినిమాలో టికెట్ దొరకడం అంటే లాటరీ తీయడం లాంటిదే.


ఇక ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తే అక్కడి జిఓ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ముందురోజు రాత్రి ప్రీమియర్లకు అనుమతి లేకపోవడం, కేవలం అర్ధరాత్రి 1 గంట నుంచి మాత్రమే షోలు పెట్టాలని చెప్పడం ఫ్యాన్స్ నిరాశకు గురిచేస్తోంది. తెలంగాణలో ముందే షోలు మొదలై, ఆంధ్రాలో ఆలస్యంగా మొదలవ్వడం వల్ల రాష్ట్రాల సరిహద్దుల్లో అభిమానులు రచ్చ చేస్తారన్నది ఖాయం. అందుకే ఇన్‌సైడ్ టాక్ ప్రకారం ఏపీ జిఓని రివైజ్ చేసి, సవరణలతో కొత్త ఆర్డర్ ఇవ్వొచ్చని గాసిప్ ఫ్రంట్ లో వినిపిస్తోంది. ఇక ముఖ్యమైన మరో అంశం - టికెట్ రేట్లు. తెలంగాణలో స్పెషల్ షోలు రూ. 800, ఏపీలో రూ. 1000 అని పెద్ద గ్యాప్ పెట్టడం ట్రేడ్ సర్కిల్స్‌కే షాక్ ఇచ్చింది. ఈ వ్యత్యాసం వల్ల తిరుగుబాటు తప్పదని, త్వరలో మార్పులు రావొచ్చని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.



అయినా గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ లాంటి చోట్ల ప్రీమియర్ షో టికెట్లు ఇప్పటికే వెయ్యి రూపాయలకు అమ్ముడైపోయాయి. ఆఫ్‌లైన్ లో కూడా సోల్డ్ అవుట్ అవ్వడం వల్ల అభిమానుల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఇప్పుడు కొత్త జిఓ వస్తే, ముందు వేసిన ఆటలు రద్దవ్వడం లేదా మళ్లీ రీ-అరేంజ్ అవ్వడం తప్పదు. ఇకపోతే ఈ చివరి నిమిషపు జిఓ గందరగోళం పెద్ద సినిమాలకు కామన్ అయిపోయింది. కానీ “ఓజీ” క్రేజ్ దృష్ట్యా ఇది మరింత హాట్ టాపిక్ అవుతోంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ఫ్యాన్స్‌కి తలనొప్పులు కాదు, థియేటర్ల ముందు జాతరే కనువిందు అవుతుందని మాత్రం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: