కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ, అటు ప్రపంచం మొత్తం, ఇటు మనదేశంలోనూ.. వాణిజ్య, ఉత్పాదక కార్యకలాపాలు స్తంభించి పోయాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రేమ్ హోమ్ చేయమన్న సంగతి అందరికి విదితమే. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో భారత్లో ఈనెల 25 వరకూ స్మార్ట్ఫోన్ల తయారీని నిలిపివేయాలని శాంసంగ్, ఓపో, వివోలు నిర్ణయించడం గమనార్హం.
భారత్లో వివిధ రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించడంతో మొబైల్ తయారీ కంపెనీలు ఈ ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. ఇక యూపీలో పూర్తి లాక్డౌన్ ప్రకటించిన క్రమంలో ఆ రాష్ట్ర పరిధిలోని నోయిడాలో శాంసంగ్, ఓపో, వివో సంస్థల తయారీ ప్లాంట్లను నిలిపివేయాల్సిన పరిస్థితి దాపురించిందని సదరు అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ మార్చి 25 వరకూ లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఈ ప్లాంట్లు తెరుచుకొనబడవని వారు విజ్ఞప్తి చేశారు.
ప్రతి సంవత్సరమూ.. 1.2 కోట్ల స్మార్ట్ఫోన్లను తయారుచేసే సామర్ధ్యం కలిగిన గ్రేటర్ నోయిడా ఫ్యాక్టరీ శాంసంగ్కు అతిపెద్ద తయారీ కేంద్రం అన్న సంగతి తెలిసినదే. స్మార్ట్ఫోన్లతో పాటు ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ టీవీలు, ఏసీలు, వంటి ఎలక్ర్టానిక్ గృహోపకరణాలు ఈ ప్లాంట్లో తయారవుతాయి. నోయిడా ప్లాంట్ క్లోజ్ చేసినప్పటికీ.. ఫ్యాక్టరీలో పనిచేసే ఆర్అండ్డీ ఉద్యోగులను ఇంటి నుండే పనిచేయాలని శాంసంగ్ సూచించింది.
ఇక వివో కంపెనీ కూడా తమ ఉద్యోగులందరినీ ఇంటి నుంచి పనిచేయాలని ఆజ్ఞాపించింది. ఒకవైపు ఎల్జీ తమ నోయిడా, పుణే ప్లాంట్లలో ఉత్పత్తిని పూర్తిగా క్లోజ్ చేసింది. అయితే పుణే, చెన్నయ్లోని ప్లాంట్లలో ఉత్పత్తిని ఎరిక్సన్, నోకియాలు కొనసాగించడం విశేషం. ఈ మేరకు... తాము, కేవలం 50% సిబ్బందితో ఫ్యాక్టరీలో ఉత్పత్తి కొనసాగిస్తున్నట్లు ఎరిక్సన్ ఓ వార్తాసంస్థకు వెల్లడించింది.