తబ్లీగి జమాత్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితోపాటు , వారితో సన్నిహితంగా మెలిగిన వారితో తెలంగాణ లో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగింది . ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య , ఒక్కసారిగా పెరుగుతుండడం రాష్ట్ర ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది . రాష్ట్ర వ్యాప్తంగా కరోనా హాట్ స్పాట్ లు వెలుగు చూస్తుండడం , ఆయా ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు . నిన్న, మొన్నటి వరకు తక్కువ సంఖ్యలో వెలుగు చూసిన కరోనా పాజిటివ్ కేసులు , శుక్రవారం ఒక్కరోజే 75 కేసులు నమోదయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించాడు . ఇందులో ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు .
షాద్ నగర్ , సికింద్రాబాద్ ప్రాంతాలకు చెందిన వారు మరణించినట్లు చెప్పారు . వీరితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు . తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 229 కు చేరుకోగా, ఇప్పటి వరకు మృతుల సంఖ్య 11 చేరింది . తెలంగాణ లో కరోనా బాధితులయిన 32 మంది కోలుకుని ఇంటికి చేరుకున్నారు . రాష్ట్రం లోని ఆరు ల్యాబ్ ల్లో 24 గంటలపాటు మూడు షిఫ్ట్ ల్లో యుద్ధ ప్రాతిపదికన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు .
కరోనా కట్టడికి స్వీయ నిర్బంధం మినహా మరొక మార్గం లేదని, లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని నిపుణులు సూచించారు . కరోనా వైరస్ ప్రస్తుతం మూడవ దశకు చేరుకుందని , ఈ దశలో విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని చెబుతున్నారు . స్వీయ నిర్బంధం , సామాజిక దూరం ద్వారానే ఈ దశలో కరోనా ను కట్టడి చేయగలమని నిపుణులు చెప్పారు .