ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. భూపాల్ లో నివాసముండే 45 ఏళ్ల ఓ వ్యక్తి మద్యానికి బానిస గా మారిపోయాడు. కుటుంబ పోషణ పట్టించుకోకుండా తరచూ మద్యం తాగి వచ్చి కుటుంబ సభ్యులను వేధిస్తూ ఉండేవాడు. ఇక ప్రతి రోజూ తాగి వచ్చి భార్యను నోటికి వచ్చినట్టుగా దుర్భాషలాడుతూ ఉండేవాడు. ఇక తండ్రి తీరుతో కూతురు రోజు కోపంతో రగిలిపోతూ ఉండేది. ఇటీవలే మరోసారి తండ్రి తాగొచ్చి తల్లిని దుర్భాషలాడుతూ దారుణంగా కొడుతున్న సమయంలో... కూతురు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పక్కనే ఉన్న ఓ కర్ర తీసుకొని తండ్రి తల పై దాడి చేసింది.
దీంతో అతడి తల పగిలి పోయి చివరికి రక్తపుమడుగులో నే కుప్పకూలి మరణించాడు. ఆ తర్వాత ఒక్కసారిగా భయాందోళనకు గురైన సదరు యువతి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి తన తండ్రిని చంపిన విషయాన్ని చెప్పి నేరం అంగీకరించింది. దీంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు. బాలికను అరెస్టు చేయడంతో పాటు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక నిందితురాలు మైనర్ బాలిక కావడంతో ఆమెను బాలల శిక్షణ శిబిరానికి పంపించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటన స్థానికంగా అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.