ఏపీలో అధికార వైసీపీలోనే కాదు..ప్రతిపక్ష టీడీపీలో సైతం ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా విజయవాడలో టీడీపీ నేతల మధ్య అసలు సమన్వయం లేదు. ఇక్కడ నేతలు ఒకరి వెనుక ఒకరు గోతులు తీసుకునే పనిలో ఉన్నారు. అలా గోతులు తీసుకునే గెలవాల్సిన విజయవాడ కార్పొరేషన్‌లో టీడీపీ ఓడిపోయింది. ఇక్కడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌లు ఒక వర్గంగా ఉంటే, బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు మరో వర్గంగా ఉన్నారు.

ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వీరి వర్గాల మధ్య విజయవాడ కార్పొరేషన్ ఛైర్మన్ అభ్యర్ధి విషయంలో వివాదం మొదలైంది. తమకు కావాల్సిన అభ్యర్ధిని పెట్టుకోవాలని బోండా వర్గం చూసింది. అటు కేశినేని తన కుమార్తెని అభర్ధిగా దింపేశారు. ఈ క్రమంలోనే తనకు ఎవరు సపోర్ట్ లేకపోయిన టీడీపీని గెలిపించుకుంటానని కేశినేని ప్రకటించి, బోండా, బుద్దాలపై విమర్శలు చేశారు. అటు బోండా, బుద్దాలు కూడా కేశినేనికి కౌంటర్లు ఇచ్చారు.

ఈ క్రమంలోనే అధినేత చంద్రబాబు ఈ పరిస్తితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అటు కేశినేని కుమార్తె శ్వేత కూడా, బోండా, బుద్దాలని కలిసి విభేదాలకు చెక్ పెట్టాలని అనుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. దీంతో కార్పొరేషన్ టీడీపీ చేతి నుంచి జారిపోయింది. అయితే వీరి మధ్య విభేదాలు ఇంకా సైలెంట్‌గా నడుస్తున్నట్లే కనిపిస్తోంది. ఈ రచ్చ వచ్చే ఎన్నికల వరకు నడిచేలా ఉంది.


అప్పుడు కూడా ఇదే పరిస్తితి ఉంటే విజయవాడ సెంట్రల్‌లో ఉన్న కేశినేని వర్గం, బోండాకు సహకరించే పరిస్తితి ఉండదు. అలాగే విజయవాడ ఎంపీగా పోటీ చేసే కేశినేనికి...బోండా, బుద్దా వర్గాల సపోర్ట్ ఉండదు. దీని వల్ల టీడీపీకి భారీ నష్టం జరిగేలా కనిపిస్తోంది. కాబట్టి అధినేత చంద్రబాబు ఇప్పటికైనా బెజవాడలో నేతలకు సయోధ్య కుదిర్చి, పార్టీని గాడిలో పెట్టకపోతే అంతే సంగతులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: