కృష్ణాజిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో అధికారపార్టీ నేతల మధ్య పెద్ద చిచ్చు రేగుతోంది. ఇద్దరు నేతల మధ్య ఆధిపత్యపోరు వల్లే గొడవలు బాగా పెరిగిపోతున్నట్లు సమాచారం. మంత్రి జోగిరమేష్ కు నియోజకవర్గం ఎంఎల్ఏ వసంతకృష్ణప్రసాద్ కు మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. దీనికి కారణం ఏమిటా అని పరిశీలించినపుడు ఓ విషయం  బయటపడింది. వచ్చే ఎన్నికల్లో పెడన ఎంఎల్ఏ, మంత్రి జోగి మైలవరం నియోజకవర్గం నుండి పోటీచేయాలని ట్రై చేస్తున్నారట. దీన్ని  మైలవరం సిట్టింగ్ ఎంఎల్ఏ వసంత గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. దీంతోనే ఇద్దరిమద్య గొడవలు పెరిగిపోతున్నట్లు సమాచారం.





ఇక్కడ విషయం ఏమిటంటే పెడనకు ప్రాతినిధ్యం వహిస్తున్న జోగిది అసలు నియోజకవర్గం మైలవరమే. 2009 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చెప్పారని మైలవరంలో కాకుండా పెడనలో పోటీచేసి గెలిచారు. అయితే మారిన రాజకీయ పరిణామాల్లో మళ్ళీ 2014లో మైలవరంకు మారి టీడీపీ అభ్యర్ధి దేవినేని ఉమపై పోటీచేసి ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి జోగిని మళ్ళీ  జగన్మోహన్ రెడ్డి పెడననుండే పోటీచేయించారు.





దేవినేనిపై గట్టి అభ్యర్ధిని వెతకటంలో భాగంగా నందిగామకు చెందిన వసంతను మైలవరంలో పోటీచేయించారు. దేవినేనిని ఎదుర్కోవాలంటే ఆర్ధిక, అంగ బలంలో ధీటైన అభ్యర్ధి వసంతే అని అందరికీ తెలుసు. అయితే సొంతనియోజకవర్గం నందిగామ. ఇదేమో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. అందుకనే వసంతతో మాట్లాడిన జగన్ మైలవరంలో పోటీచేయించారు. జగన్ అనుకున్నట్లే పెడనలో జోగి, మైలవరంలో వసంత ఇద్దరు గెలిచారు.





అయితే వచ్చే ఎన్నికల్లో జోగి తన సొంతనియోజకవర్గమైన మైలవరంలోనే పోటీచేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందులో భాగంగానే మైలవరంలోని తన మద్దతుదారులతో వసంతకు వ్యతిరేకంగా అంతర్లీనంగా గొడవలు మొదలుపెట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తాను పార్టీమారుతారనే ప్రచారం కూడా తన ప్రత్యర్ధుల పనే అనే అనుమానాలు ఎంఎల్ఏలో పెరిగిపోతోంది.  దీంతో వసంతలో అభద్రత మొదలైంది. అందుకనే వసంత కూడా జోగిని ధీటుగానే ఎదుర్కొంటున్నారు. దాంతో మైలవరం వైసీపీలో గొడవలు రోడ్డున పడ్డాయి. చివరకు ఈ ఇద్దరి పంచాయితీ జగన్ దగ్గరకు చేరింది ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: