వైఎస్ఆర్ బిడ్డగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన షర్మిల

• సొంత అన్నకే వ్యతిరేకంగా మారి రాజకీయాలు రక్తి కట్టిస్తున్నారు 

• అసలైన వారసురాలిగా చెప్పుకుంటూ సీఎం కుర్చీపై కన్ను  

( ఏపీ - ఇండియహెరాల్డ్)


వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ విజయమ్మల ముద్దుల కూతురు వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో ఒక ప్రకంపం సృష్టిస్తున్నారు. షర్మిల తన తండ్రి రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని పాలిటిక్స్ లో దూసుకెళ్తున్నారు. భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరిన ఆమె ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి 24వ అధ్యక్షురాలు అయ్యారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెల్లెలు అయినా అతనికి వ్యతిరేకంగానే పోరాటం చేస్తున్నారు.

షర్మిల రాజకీయ ప్రవేశం అంత సాధారణంగా ఏమీ జరగలేదు. ఆమె తన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేయడం ద్వారా దృష్టిని ఆకర్షించారు, ఆమె సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2012, జూన్ నుంచి రాజకీయాల్లో ఉండకుండా పోయారు. ఆ సమయంలో వైసీపీని బతికించింది షర్మిలనే అని చెప్పుకోవచ్చు. ఆమె పార్టీ కన్వీనర్‌గా పనిచేశారు. ఉపఎన్నికల్లో 18 అసెంబ్లీ స్థానాల్లో 15 స్థానాలు, ఒక పార్లమెంటు సీటును వైసీపీ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. షర్మిల 2012, అక్టోబర్ 18న కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి 3,000 కి.మీ పాదయాత్రను ప్రారంభించి, 14 జిల్లాలను కవర్ చేస్తూ 2013, ఆగస్టు 4న ఇచ్ఛాపురంలో పూర్తి చేశారు.

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు, షర్మిల అప్పటి సీఎం చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకున్నారు. “బై బై బాబు” అని నినాదాలు చేస్తూ ఆయన ఓటమిని శాసించారు. ఓ టైమర్ క్లాక్‌తో బ్రాండెడ్ బస్సుల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా 11 రోజుల బస్సు యాత్ర నిర్వహించారు. “ప్రజా తీర్పు - బై బై బాబు” పేరుతో జరిగిన ఈ ప్రచారం 1,553 కి.మీ.లు సాగింది. 39 పబ్లిక్ అడ్రస్‌లను కలిగి ఉంది. ఆమె 20,000 ఆటోగ్రాఫ్ క్యాప్‌లను పంపిణీ చేశారు.

2021 ఫిబ్రవరిలో, షర్మిల జగన్‌తో రాజకీయ విభేదాలను వ్యక్తం చేశారు, తెలంగాణలో పార్టీ ఉనికి లేకపోవడాన్ని గమనించారు. 2021, ఏప్రిల్ 9న, ఆమె తన తండ్రి రాజశేఖర రెడ్డి జన్మదినమైన 2021, జులై 8న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. జులై 8న ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ప్రారంభించారు.

2023, నవంబర్‌లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పాల్గొనబోదని షర్మిల ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని ఆమె తెలిపారు. 2024, జనవరి 4న ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తర్వాత, షర్మిల AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024, జనవరి 16న ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అలా షర్మిల రాజకీయ జీవితం చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: