మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. నిన్న‌ రాత్రి బెంగళూరు నుంచి లండన్‌కు బయలుదేరు. లండన్‌లో ఉన్న తన పెద్ద కుమార్తెను కలిసేందుకు ఆయన ఈ పర్యటనకు వెళ్తున్నారు. సమాచారం ప్రకారం ఈసారి ఆయన 13 రోజుల భారీ టూర్ ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. అక్టోబర్ 23 వరకు లండన్‌లోనే ఉండనున్నారు. ఇంతకాలం రాజకీయ హీటు మధ్య విరామం తీసుకోవడం ఇదే మొదటిసారి. గత కొన్ని నెలలుగా జగన్‌ ప్రధానంగా తాడేపల్లి – బెంగళూరు లింక్‌ లోనే ఉండిపోయారు. అయితే లండన్ పర్యటనకు ముందు ఆయన విశాఖలో చేసిన భారీ రోడ్‌ షో రాజకీయంగా కొత్త ఊపుని తెచ్చింది.
 

దాదాపు ఆరు గంటలపాటు సాగిన రోడ్‌షో లో జన సమూహం తరలి రావడంతో వైసీపీ కేడర్‌ లో జోష్‌ పెరిగింది. మూడు నెలల తర్వాత జగన్‌ నేరుగా జనాల్లోకి రావడం, ప్రజలతో మమేకం కావడం పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. లండన్ బయలుదేరే ముందు జగన్‌ పార్టీ నేతలతో పలు కీలక సమావేశాలు కూడా నిర్వహించినట్లు సమాచారం. పార్టీని జనంలో ఉంచే విధంగా పని చేయాలని, మెడికల్ కాలేజీలు, పీపీపీ ప్రాజెక్టులు, ప్రజా కార్యక్రమాలు వంటి అంశాల్లో యాక్టివిటీని పెంచాలని ఆయన ఆదేశించారు. ప్రజల మధ్య వైసీపీ మళ్లీ బలంగా వినిపించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అంతేకాక, పార్టీ భవిష్యత్ దిశపై యాభై రోజుల షెడ్యూల్ కూడా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

ఇక మాజీ మంత్రి కొడాలి నాని మరియు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవల జగన్‌ను కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరికీ పార్టీలో మళ్లీ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొడాలి నాని ఆపరేషన్‌ కారణంగా, వంశీ జైలు అనుభవం కారణంగా కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ మళ్లీ పార్టీ యాక్టివిటీల్లోకి రావాలని జగన్‌కు చెప్పడంతో, ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మొత్తం మీద, ఈసారి జగన్ లండన్ టూర్ ఫ్యామిలీ ట్రిప్ మాత్రమే కాదు – రాజకీయంగా కూడా రిచార్జ్ ప్యాకేజీ లాంటిదే. తిరిగి వచ్చిన వెంటనే పార్టీ కార్యక్రమాలను మరింత దూకుడుగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని వర్గాలు చెబుతున్నాయి. ఇక నుండి తాను పూర్తిగా జనంలోనే ఉండేలా ప్లాన్‌ చేసుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: